-3.21శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదు

by  |
-3.21శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదు
X

ముంబయి: మన దేశ టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు మే నెలలో ప్రతికూలంగా నమోదనట్టు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) వెల్లడించింది. అందుబాటులో ఉన్న గణాంకాలను సమీక్షించిన అనంతరం మే నెలలో టోకు ద్రవ్యోల్బణం -3.21 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో పరిమిత సమాచారం ఉండటం వల్ల మే గణాంకాలను మార్చి గణాంకాలతో పోల్చినట్టు డీపీఐఐటీ సోమవారం ప్రకటించింది. కరోనా వ్యాప్తితోపాటు లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ టోకు ద్రవ్యోల్బణ గణాంకాలను వెల్లడించలేదని తెలిపింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విధానంలో ధరల డేటాను సేకరించాలని కేంద్ర గణాంకాల శాఖ, కిందిస్థాయి కార్యాలయాలను సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి సూచిక జూలైలో విడుదల అవుతుందని డీపీఐఐటీ పేర్కొంది. ఆహార ద్రవ్యోల్బణం 1.13 శాతానికి దిగొచ్చింది. తయారీ, ఇంధన ద్రవ్యోల్బణం ప్రతికూలతల్లో నమోదయ్యాయి. సమాచారం లేకపోవడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేయలేకపోయింది.


Next Story