అర్ధరాత్రి జోరు వర్షంలో.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే కానిచ్చేశారు

by  |
Nizamabad Bank Colony
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని బ్యాంక్ కాలనీలో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తుండగా.. అదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేశారు దుండగులు. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారం ,నాలుగు లక్షల నగదును అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం..

నిజామాబాద్ మండలం తాడెం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ గత కొంతకాలంగా బ్యాంక్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఊర్లో జరుగుతున్న పండగకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు రాత్రి సమయంలో వర్షం పడుతుండగా విజయ్ కుమార్ ఇంటికి చేరుకొని పక్కనే ఉన్న ఇంటి తలుపు తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో దాచుకున్న 12 తులాల బంగారు ఆభరణాలు, పరుపు కింద దాచిన నాలుగు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న విజయ్ కుమార్ తాళం పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు భావించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బట్టలు చిందరవందరగా పడేసి ఉండడంతో 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, నగర సీఐ సత్యనారాయణ, టౌన్ ఎస్ఐ సందీప్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ రప్పించి దొంగల వేలిముద్రలు సేకరించారు. బాధితుడు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కారణంగా జనసంచారం లేకపోవడంతో దొంగలకు అనుకూలంగా మారింది. ఇదిలా ఉండగా పోలీసులు కాలనీలో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ఆనవాళ్లు సేకరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కాగా దొంగతనం జరిగిన ఇల్లు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.


Next Story