10 శాతం తగ్గిన మారుతీ సుజుకి లాభాలు

by  |
10 శాతం తగ్గిన మారుతీ సుజుకి లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా అమ్మకాలు దెబ్బతినడంతో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసిక నికర లాభాలు 9.7 శాతం తగ్గి రూ. 1,166.10 కోట్లుగా నమోదయ్యాయి. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 32 శాతం పెరిగి రూ. 24,023.7 కోట్లుగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 4,92,235 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది కంటే 28 శాతం పెరిగింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నికర లాభాలు 25.1 శాతం క్షీణించి రూ. 4,229.7 కోట్లుగా నమోదు చేసింది.

కార్యకలాపాల ఆదాయం 7 శాతం తగ్గి రూ. 70,332.5 కోట్లకు చేరుకుంది. అమ్మకాలు తగ్గడం, ముడి వస్తువుల ధరలు పెరగడం, ప్రతికూల విదేశీ మారకం, తక్కువ నిర్వహణేతర ఆదాయం, తక్కువ నిర్వహణ ఖర్చులు, వ్యయ తగ్గింపుల వల్లే కంపెనీ లాభాలు తగ్గాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కరోనా సంబంధిత సమస్యల వల్ల పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్ల అమ్మకాలు 6.7 శాతం తగ్గి 14,57,861 యూనిట్లను చేరుకున్నాయి. 2018-19తో పోలిస్తే ఇది 21.7 శాతం తగ్గడం గమనార్హం. దేశీయ అమ్మకాలు 6.8 శాతం తగ్గాయని, ఎగుమతులు సైతం 5.9 శాతం క్షీణించినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ ఆర్థిక పనితీరుకు అనుగుణంగా, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న డైరెక్టర్ల బోర్డు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ. 45 డివిడెండ్‌కు ఆమోదం తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం కంపెనీ షేర్ ధర 1.31 శాతం తగ్గి రూ. 6,552 వద్ద ట్రేడయింది.



Next Story

Most Viewed