మారుతీ సుజుకి త్రైమాసికం లాభం 28 శాతం క్షీణత!

by  |
మారుతీ సుజుకి త్రైమాసికం లాభం 28 శాతం క్షీణత!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 1,291.70 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో.. వార్షిక ప్రాతిపదికన 28 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 1,795.60 కోట్లుగా నమోదైంది. అయితే, విశ్లేషకులు త్రైమాసిక నికర లాభం రూ. 1300 కోట్లుగా అంచనా వేశారు. ఇక, నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 18,198.70 కోట్లతో 15.19 శాతం తగ్గింది. సేల్స్ ప్రమోషన్లకు ఖర్చు అధికమవడం, విక్రయాలు తగ్గిపోవడం వంటి కారణాలుగా మారుతీ సుజుకి పేర్కొంది. దేశీయ మార్కెట్లో నాలుగో త్రైమాసికానికి 3.60 లక్షల వాహనాలను విక్రయించినట్టు కంపెనీ వివరించింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం తగ్గింది. ఇక, 2019-20 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 60 డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో షేరు సుమారు 2 శాతం లాభపడి రూ. 5,035.25 వద్ద ట్రేడయింది.

Next Story