దేశవ్యాప్తంగా అందుబాటులోకి మారుతీ సుజుకి 'స్మార్ట్ ఫైనాన్స్'

by  |
దేశవ్యాప్తంగా అందుబాటులోకి మారుతీ సుజుకి స్మార్ట్ ఫైనాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి వినియోగదారుల కోసం అన్ని రకాల ఆన్‌లైన్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించే ‘స్మార్ట్ ఫైనాన్స్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో కంపెనీ పరిమిత నగరాల్లో ‘స్మార్ట్ ఫైనాన్స్’ సేవలను ప్రారంభించింది. ఇప్పుడు దీన్ని అరెనా, నెక్సా(ప్రీమియం కార్ల ఔట్‌లెట్) రెండింటి వినియోగదారుల కోసం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ సహా మొత్తం 14 ఫైనాన్షియర్లను కలిగి ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘ఇటీవల కొత్తగా కార్లను కొనుగోలు చేయడానికి ముందు చాలామంది ఆన్‌లైన్ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కార్ల వేరియంట్ గురించి, ఫీచర్లు, ఫైనాన్సింగ్ వివరాలు ఇలా అన్నిటికీ ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీయే అన్ని రకాలుగా ఎండ్-టూ-ఎండ్ స్మార్ట్ ఫైనాన్స్ ద్వారా కార్ల ఫైనాన్సింగ్ పరిష్కారాన్ని అందిస్తుంది. ఇదివరకు పరిమితంగా మొదలైన ఈ కార్యక్రమానికి గణనీయమైన స్పందన వచ్చింది. అందుకే దీన్ని విస్తరిస్తూ దేశవ్యాప్తంగా అందించాలని నిర్ణయించినట్టు’ మారుతీ సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

Next Story