మారుతీ సుజుకి ఆల్టో కారుకు 20 ఏళ్లు!

by  |
మారుతీ సుజుకి ఆల్టో కారుకు 20 ఏళ్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) నుంచి వస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ కారు ఆల్టోకు 20 ఏళ్ల వయసని కంపెనీ వెల్లడించింది. రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఆల్టో ఇప్పటివరకు 40 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటిందని మంగళవారం కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరవై ఏళ్లలో 40 లక్షల మంది కస్టమర్లను సాధించి సాటిలేని వాహనంగా పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం గర్వంగా ఉందని ఎంఎస్ఐ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

ఈ మోడల్ దేశీయ ఐకానిక్ బ్రాండ్‌గా మారిందని, మారుతున్న యువత ఆకాంక్షలను తీరుస్తూ ఎప్పటికప్పుడు అభివృద్ధి కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాంపాక్ట్ కారు రెండు దశాబ్దాలలో అనేక మార్పులకు, నవీకరణలకు గురైంది. భవిష్యత్తులోనూ ప్రతి తరాల అవసరాలకు అనుగుణంగా మారుతోందని కంపెనీ తెలిపింది. ‘గడిచిన 16 సంవత్సరాలుగా ఆల్టో కారు నంబర్ వన్ విక్రయ వాహనంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు భారతీయ వినియోగదారుల హృదయాలను గెలుస్తోంది’ అని శశాంక్ వివరించారు.

ప్రతి ఏటా కొత్త అప్‌గ్రేడ్‌తో కొత్తగా కారు కొనాలనుకునే వారికి మొదటి ప్రాధాన్యతగా నిలుస్తోందని ఆయన తెలిపారు. 2019-20 ఆల్టో కస్టమర్లలో 76 శాతం మంది తమ మొదటి కారుగా ఆల్టోను ఎంచుకున్నారని, ఈ ఆర్థిక సంవత్సరం అది 84 శాతానికి పెరిగిందని శశాంక్ చెప్పారు. కాగా, మారుతీ సుజుకి 2000లో ఆల్టోను ప్రారంభించిన తర్వాత..2008లో 10 లక్షల యూనిట్లను, 2012లో 20 లక్షలు, 2016లో 30 లక్షల యూనిట్లను విక్రయించింది.



Next Story

Most Viewed