జగన్ టార్గెట్ అదే.. అందుకే ఈ దాడులు

by  |
జగన్ టార్గెట్ అదే.. అందుకే ఈ దాడులు
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ మన్యంలో జూన్ 16న జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ జూలై 1న ఏవోబీ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ ఓ లేఖ విడుదల చేశారు. విశాఖ మన్యంలోని తీగలిమెట్ట గ్రామానికి సమీపంలో దట్టమైన అడవిలో పోలీసుల కూంబింగ్‌లో మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో కరీంనగర్‌కు చెందిన సందె గంగయ్య సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. కరోనా కల్లోల సమయంలో ప్రజలకు వైద్య సహాయాన్ని అందిస్తున్న మావోయిస్టు పార్టీ.. ప్రతిఘటనా చర్యలను చేపట్టలేదని గణేశ్ వివరించారు. జగన్ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు కనీస వైద్యం అందించడం లేదని వాపోయారు.

ఇప్పటి వరకు ఒక్క వైద్యుడిని కూడా పంపలేదని గణేశ్ ఆరోపించారు. అలాగే ఒక్క కరోనా నిర్ధారణ పరీక్ష కూడా చేయలేదని లేఖలో పేర్కొన్నారు. అందువల్లే తాము వారికి వైద్యసహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో దాడులకు ఒడిగట్టారని ఆరోపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మన్యంలోని ఖనిజ సంపదపైనే దృష్టి పెట్టిందని.. అందుకు ఆటంకంగానున్న మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇన్ఫార్మర్‌ల ద్వారా సమాచారం తెలుసుకుని పాశవిక దాడికి పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు ఈ దాడులను ఖండించాలని కోరారు. పోలీసుల దాడులను నిరసిస్తూ జూలై 1న తలపెట్టిన ఏవోబీ బంద్‌ను విజయవంతం చేయాలని ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖలో పిలుపునిచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story