కేసీఆర్ మోసగాడు.. మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ

by  |
Manda Krishna Madiga
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి అన్యాయం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దళిత సాధికారత పేరిట పచ్చి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు శనివారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దళిత సాధికారతపై ప్రగతి భవన్‌లో ఆదివారం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాన్ని స్వాగతిస్తున్నామని, భవిష్యత్‌లోనైనా దళితుల పురోభివృద్ధికి ఇది ఉపయోగపడేలా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే దానిని అమలుచేసే చిత్తశుద్ధి కేసీఆర్‌కి లేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని బహిరంగంగా హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ సాధికారత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితులకిస్తామన్న మూడెకరాల భూమి ఏమైందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములను ప్రభుత్వ అవసరాల కోసం బలవంతంగా లాక్కొని కలెక్టరేట్లు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు కట్టి దళితులకు నిలువ నీడలేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు దళిత సాధికారత గురించి ఎలా మాట్లాడుతారని ఆయన మంద కృష్ణ పేర్కొన్నారు. ఇదంతా పచ్చి బూటకమని ఆయన తెలిపారు.

సీఎం యాదాద్రి దేవాలయంపై ప్రమాణం చేస్తాడా?

యాదాద్రి దేవాలయ అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి వ్యవహరిస్తున్నారో అంతే చిత్తశుద్ధి దళిత సాధికారితతో అమలు చేస్తానని సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయంపై ప్రమాణం చేస్తారా అని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. దళితుల్ని అడుగడుగునా అణచివేస్తున్న కేసీఆర్ దళిత సాధికారత గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లవుతుందన్నారు. వీసీల నియామకాల్లోనూ దళితులకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. మంత్రి వర్గంలో దళితులకు తగిన స్థానం ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని అన్నారు. దళితులను అన్ని విధాలుగా అణిచివేసి కొత్తగా రూ.1000 కోట్లతో సాధికారత పేరుతో ముందుకు రావడం దగా చేయడానికేనని పేర్కొన్నారు. సీఎం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఏడేండ్లలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

Next Story

Most Viewed