షాకింగ్ : రూ.10 ఇవ్వమన్నందుకు కక్ష్య గట్టి బాలుడిపై కాల్పులు..

by  |
rs-10
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతీ చిన్న విషయానికే నేటితరం ఆగ్రహానికి గురవుతోంది. సాయం కోరినా.. పనిచేసి ప్రతిఫలం ఆశించినా వెంటనే కోపోద్రిక్తులవుతున్నారు. ఆ తర్వాత ఒక్క క్షణంలో కోపంతో ఊగిపోతూ ఎదుటి వ్యక్తులపై సహనం కోల్పోయి దాడులకు పాల్పడటం లేదా హత్య చేసేందుకు అయినా వెనకాడటం లేదు. ఇందులో కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమ ఆవేశాన్ని అణుచుకోలేక కేసుల్లో చిక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతా జరిగిపోయాక అలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండు అని పశ్చాత్తాప పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ఈ కోవలోకి వస్తుంది.

10 రూపాయల పడవ చార్జి వసూలు చేసినందుకు గాను 17ఏళ్ల బాలుడు గన్‌తో కాల్చి చంపబడ్డాడు. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా బిథాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్‌భౌరా గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మృతుడిని సికిల్ యాదవ్‌గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం సికిల్ యాదవ్ బన్‌భౌరాకు చెందిన అనిల్ యాదవ్‌ను గ్రామంలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి తీసుకెళ్లడానికి రూ.10 పడవ ఛార్జీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో వరదల కారణంగా మొత్తం గ్రామంలో నడుము లోతు నీరు చేరుకుంది. పడవ ద్వారా మాత్రమే రవాణా సాధ్యం.

అయితే, అనిల్ యాదవ్ నుండి పది రూపాయాలు ఛార్జీ వసూలు చేసిన తరువాత, అతని సోదరుడు రణబీర్ యాదవ్ ఆగ్రహానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం తన తమ్ముడి వద్ద నుంచే డబ్బులు తీసుకుంటావా అని బాలుడిని వేధించాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన హింసాత్మకంగా మారింది. మరుసటి రోజు సోమవారం ఉదయం నిందితుడు సికిల్ యాదవ్ ఇంటికి వెళ్లి తన వద్దనున్న గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బుల్లెట్ సికిల్ కడుపులో తగిలింది. రణబీర్ కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడిని వెంటనే మాజీని బిథాన్‌లో ఉన్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. మరల అక్కడ నుండి సమస్తిపూర్‌లోని సదర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా.. మార్గంమధ్యలో బాలుడు మరణించినట్టు అతని తండ్రి తెలిపాడు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed