ఓల్డ్ సిటీలో దారుణం.. పాసుపోర్టు విడిపించడం లేదని కత్తులతో నరికి..!

by  |
ఓల్డ్ సిటీలో దారుణం.. పాసుపోర్టు విడిపించడం లేదని కత్తులతో నరికి..!
X

దిశ, చార్మినార్: బంగారాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేయించడంతో పాటు అధికారులు సీజ్ చేసిన పాస్‌పోర్టును విడిపించడంలో జాప్యం చేస్తున్న వ్యక్తిని హత్య చేశాడు మిత్రుడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్​పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది.

చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్​ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బార్కస్‌కు చెందిన హమీద్​ బిన్​ అల్​ జుబేది (37) మిలీనియం ట్రావెల్స్, వెస్టన్​యూనియన్ మనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఆదిల్ జాఫ్రి.. హమీద్ స్నేహితుడు. 2019లో దుబాయ్​నుంచి వస్తున్న ఆదిల్ జాఫ్రికి అక్కడి నుంచి కిలో బంగారాన్ని హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు తీసుకురమ్మని హమీద్ చెప్పాడు. కిలో బంగారానికి సంబంధించిన డబ్బులు కూడా అప్పట్లో ట్రాన్స్‌ఫర్​చేశాడు. కిలో బంగారం తీసుకుని వస్తున్న ఆదిల్ జాఫ్రిని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకుని, అక్రమ బంగారం రవాణా కింద కేసులు నమోదు చేసి పాస్​పోర్టును సీజ్ చేశారు. అప్పటి నుంచి వారిరువురి మధ్య పాస్‌పోర్టు విషయంలో విబేధాలు తలెత్తాయి.

తాను మళ్లీ దుబాయ్‌కు వెళ్లేందుకు తన పాస్‌పోర్టు ఇప్పించాలని హమీద్‌పై.. ఆదిల్​జాఫ్రి తీవ్ర ఒత్తిడి చేయసాగాడు. దీంతో కోర్టులో కేసు నడుస్తుందని, ఆదిల్​జాఫ్రి ఖర్చుల నిమిత్తం వచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. అయినా వారిమధ్య గొడవలు ఆగలేదు. ఈ నేపథ్యంలేనే బుధవారం సాయంత్రం హమీద్ బండ్లగూడ హాషమాబాద్​ప్రాంతంలో కారులో వెళ్తుండగా.. ఆదిల్​జాఫ్రి, సయీద్​ జాఫ్రి, రయీస్​ జాఫ్రి, సాహెద్​జాఫ్రిలు కలిసి అడ్డగించారు. కత్తులతో విచక్షణ రహితంగా నడి రోడ్డుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హమీద్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed