కరోనా పేరుతో పెరిగిన ఫిషింగ్ దాడులు

by  |
కరోనా పేరుతో పెరిగిన ఫిషింగ్ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు వారాలుగా కరోనా వైరస్ పేరుతో ఇంటర్నెట్‌లో ఫిషింగ్, మాల్వేర్ దాడులు విపరీతంగా పెరిగినట్లు గూగుల్ ప్రకటించింది. ఇప్పటికే కరోనా వ్యాప్తి మ్యాపుల పేరుతో హ్యాకర్లు దాడి చేస్తుండగా ఇప్పుడు కొత్తగా ఫిషింగ్ ఈమెయిళ్ల డేటాను గూగుల్ వెల్లడించింది. తమ మెయిలింగ్ సర్వీసు జీమెయిల్‌లో ఒకరోజు 18 మిలియన్ల కరోనాకు సంబంధించిన ఫిషింగ్ మెయిళ్లను బ్లాక్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. ఇక కరోనా అనుసంధిత విషయాలను కూడా కలిపితే ఇలాంటి ఫిషింగ్ మెయిళ్లు దాదాపు 100 మిలియన్లకు పైగా తాము బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇవి కాకుండా ఒకరోజులో దాదాపు 240 మిలియన్ల కొవిడ్ 19 సంబంధిత స్పామ్ మెసేజ్‌లను జీమెయిల్ బ్లాక్ చేస్తోంది. తమ అధునాతన మెషీన్ లెర్నింగ్ మోడళ్ల సాయంతో 99.9 శాతం స్పామ్ మెయిళ్లను తాము అడ్డుకోగలుగుతున్నట్లు గూగుల్ వెల్లడించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా జనాల్లో కలుగుతున్న భయాన్ని, ఆర్థిక అభద్రత భావాన్ని సొమ్ము చేసుకునే ఉద్దేశంతో హ్యాకర్లు స్పామింగ్, ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. అందుకే తమ అడ్వాన్స్‌డ్ టూల్స్‌తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాల ప్రభుత్వాల అధికారిక సమాచారం మేరకు ఎప్పటికప్పుడు ఈ దాడులను కట్టడి చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. కాబట్టి ఏ లింక్ పడితే ఆ లింక్ ఓపెన్ చేయకపోవడమే శ్రేయస్కరం.

Tags -corona, covid, hackers, Phishing attack, malware, gmail, google

Next Story

Most Viewed