లాక్‌డౌన్‌లో అందరూ చేస్తున్నది ఇదే!

by  |
లాక్‌డౌన్‌లో అందరూ చేస్తున్నది ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయాన్ని ఎక్కువ మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ప్రైమ్‌తోనే కాలక్షేపం చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. అవును… అనుకుంటాం గానీ… ఫోన్లో ఎంతసేపు టైంపాస్ చేయగలం చెప్పండి? మహా అయితే చార్జింగ్ ఉన్నంత వరకు. కానీ ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేని వారు, ఫోన్ వారి బోర్ కొట్టినవారు ఒక కొత్త హాబీని ఎంచుకున్నారట. అదే గార్డెనింగ్.

సాధారణంగా వానకాలం పూట గార్డెనింగ్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు ఖాళీ సమయం ఎక్కువ ఉండటంతో ఎండాకాలం అని కూడా లెక్కచేయకుండా చెట్ల మీద తమకు ఉన్న ప్రేమను ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్లో కొత్త చిట్కాలు, ట్రిక్కులు కూడా నేర్చేసుకుంటున్నారు. బాల్కనీలో పండ్లు, కూరగాయలు పెంచడం, ఇంటిపంటలు, హైడ్రోఫోనిక్ కల్చర్, మైక్రో కల్చర్ ఇలా చాలా పద్ధతుల్లో ఇంట్లోనే కూరలు పెంచుకునే అవకాశం ఉండటంతో ఇది మరింత సులువైందని హైద్రాబాద్‌కి చెందిన పర్యావరణ నిపుణురాలు కల్పన రమేశ్ అంటున్నారు.

అంతేకాకుండా ఇంట్లో చెత్త నుంచి ఎరువు తయారు చేయడం, ఏయే చెట్టుకి ఎంత ఎరువు వేయాలి, ఏ చెట్టు ఎలా పెంచాలి అనే విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా బయటికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఇంట్లో చెత్తను బయటపడేయలేకపోవడంతో దాన్ని రీసైకిల్ చేసే పద్ధతులకోసం అందరూ వెతుకుతున్నారని కల్పన చెబుతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా టవర్ గార్డెన్, హ్యాంగింగ్ గార్డెన్, బోన్సాయ్ వంటి సాంకేతిక విధానాలను ఈ లాక్‌డౌన్ కాలంలో అమలు చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని ఆమె అన్నారు. మరి ఆలస్యమెందుకు… మీరు కూడా ఏదో ఒక గార్డెనింగ్ ట్రిక్ నేర్చేసుకుని, మీలో ప్రకృతి ప్రేమికుడిని నిద్ర లేపండి!

Tags: health, gardening, online, home garden, tower garden, interest making lockdown


Next Story

Most Viewed