దళారీల దందాతో సర్కార్‎కు టోకరా

by  |
దళారీల దందాతో సర్కార్‎కు టోకరా
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం మక్కలకు అందజేస్తున్న కనీస మద్దతు ధర మహారాష్ట్ర వ్యాపారులు ఎగరేసుకు పోతున్నారు. స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై, అధికారులను మచ్చిక చేసుకుని ఈ అక్రమ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలో మక్కలకు ధర తక్కువగా ఉండడం.. ఇక్కడ మద్దతు ధర ఎక్కువగా ఉండడమే అక్రమ రవాణాకు కారణమని తెలుస్తోంది.

మహారాష్ట్ర దళారుల దందా…

తెలంగాణ ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 ఇస్తుండడంతో మహారాష్ట్ర వ్యాపారుల కన్ను ఇక్కడి మార్కెట్ పై పడింది. అక్కడి రైతుల నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 1,100 ధరతో మక్కలను కొనుగోలు చేసిన మహారాష్ట్ర వ్యాపారులు నిర్మల్ మార్కెట్ కు తరలిస్తున్నారు. ముఖ్యంగా నాందేడ్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మక్కలు నిర్మల్ కు తరలిస్తున్నారు. ఇక్కడి రైతుల పేరిట మార్కెట్లో పేర్లు నమోదు చేయించి స్థానికంగా వంటలు పండించినట్లు అధికారులకు కొంత ముట్టజెప్పి మద్దతు ధరను పొందుతున్నారని సమాచారం. మహారాష్ట్రలో రూ. వెయ్యి మాత్రమే అమ్ముడుపోతున్న మక్కలు ఇక్కడి మార్కెట్లో దాదాపు రెట్టింపు ధరతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో న్యాయబద్ధంగా తెలంగాణ రైతులకు మాత్రమే చెందాల్సిన మద్దతు ధరను మహారాష్ట్ర వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇక్కడి వ్యాపారులు పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

విజిలెన్స్ దాడులతో వ్యవహారం తెరపైకి…

తెలంగాణ ప్రభుత్వం మార్క్​ఫెడ్​ద్వారా మక్కల కొనుగోలు చేపట్టింది. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,850 చెల్లిస్తున్నది. దీనిని ఆసరాగా చేసుకున్న మహారాష్ట్ర వ్యాపారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై అక్కడ నుంచి భారీ ఎత్తున మక్కలు తరలించి అధిక లాభార్జనకు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వ్యవసాయ మార్కెట్ కమిటీ యంత్రాంగంతో పాటు రెవెన్యూ పోలీసు శాఖకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదని సమాచారం. మహారాష్ట్ర, తెలంగాణ వ్యాపారుల రహస్య ఒప్పందం, అక్రమ రవాణా వ్యవహారాలు విజిలెన్స్​శాఖకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేసి అక్రమంగా మహారాష్ట్ర నుంచి నిర్మల్ కు తరలిస్తున్న 200 కు పైగా క్వింటాళ్ల మక్కలు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి సారంగాపూర్ మండల కేంద్రం మీదుగా నిర్మల్ జిల్లా కేంద్ర మార్కెట్ కు తరలిస్తుండగా విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఈ మేరకు అక్రమంగా తరలిస్తున్న మక్కలు పట్టుకుని సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ రామారావు వెల్లడించారు. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, ఈ వ్యవహారం వెనుక ఇరు రాష్ట్రాల వ్యాపారులతో పాటు స్థానిక అధికారి ఒకరు కీలక పాత్ర పోషిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story

Most Viewed