కలకలం రేపిన జంటల మరణాలు

by  |
కలకలం రేపిన జంటల మరణాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రేమ నిండు ప్రాణాల్ని బలికోరుతోంది.. నూరేళ్ల జీవితం ఆదిలోనే ముగిసిపోతోంది. కలిసిన మనస్సుల్ని మోసం చేయలేకనో.. కన్న వారిని ఒప్పించలేకనో.. కలువని బంధాలతో వేగలేకనో గానీ ప్రేమ పక్షులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నాయి.. కన్నవారికి కడుపు కోత మిగులుస్తూ ప్రేమికులు ఉజ్వల భవిష్యత్తును ఆర్పేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే అదేదో పాపం చేస్తున్నారన్న చందంగా కనీస ఆలోచన చేయకుండా వారిని పొట్టన పెట్టుకుంటున్నారు. ప్రేమ వ్యవహారంలో ఇటీవల ఉమ్మడి జిల్లాలో జరిగిన విషాద ఘటనలు పలువురిని కలవర పెడుతున్నాయి.

జంట మరణాలు..

* ప్రేమికులైన సాయిరాం, రమ్య బావమరదళ్లు. రమ్యకు తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయం చేయగా ఈ నెల 12న కామారెడ్డి జిల్లా సదాశివ నగర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. ఆస్ప్రతికి తరలించగా ఆదివారం సాయిరాం, చికిత్స పొందుతూ సోమవారం రమ్య మరణించింది.

* మోడేగాంకు చెందిన సతీష్ అలియాస్ ప్రభాకర్, హైదరాబాద్​కు చెందిన ఠాకూర్ మహిమ పెద్దలను ఎదురించి హైదరాబాద్​లో పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 10 వ తేదీ రాత్రి సదాశివ నగర్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో నవ దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా దుర్మరణం చెందారు. అయితే వారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారా..? లేక మరేదైనా జరిగి ఉంటుందా ..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

* ఆర్మూర్ పట్టణ శివారులోని ఓ మామిడి తోటలోని చెట్టుకు ఓ యువతి, ఓ మైనార్టీ తీరని యువకుడు గత నెల 28న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటర్ ​పరీక్షల సందర్భంగా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయగా, పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.

బలి కోరిన ప్రేమ వ్యవహారాలు..

* నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన సుంకరి సందీప్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. సెప్టెంబర్ 9న యువతి బర్త్​డే నాడు ఆమెను కలిసేందుకు బోధన్​కు వెళ్లగా, యువతి కుటుంబసభ్యులు యువకుడిని చితకబాదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది.

* అంకాపూర్ గ్రామానికి చెందిన మహేశ్​తల్లితో పాటు ఉపాధి కోసం నందిపేట మం డలం కౌల్​పూర్​లో స్థిరపడ్డారు. ఈ క్రమం లో అదే గ్రామానికి చెందిన యువతితో ఏ ర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు ఆమెను మందలించారు. ఈ విషయమై ఇద్దరు చర్చించుకుంటుండగా యువతి బంధువులు అతడిని చితకబాదారు. 15 రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఈ నెల మొదటి వారంలో చనిపోయాడు.



Next Story

Most Viewed