కలిసి జీవించలేక మృత్యు ఒడిలో ఒక్కటయ్యారు..

by  |

దిశ, వరంగల్: వాళ్లు ఇద్దరు మంచి దోస్తులు.. ఇదే దోస్తానా ప్రేమకు దారి తీసింది. ప్రియురాలికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసినా.. ఆమెతోనే సంతోషంగా జీవించాలని అతడు తాపత్రయ పడ్డాడు. కానీ, పెద్దలు ఒప్పుకోలేదో.. సమాజం చెడుగా ఆలోచిస్తుందని భావించారేమో తెలియదు. ఆ ప్రేమజంట కలిసి జీవించలేమన్న వ్యథతో కలిసి మృత్యుఒడికి చేరారు. గుండెల్ని పిండేసిన ఈ విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన రమ్య, రాజు ఇద్దరు స్నేహితులు. రమ్యకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లిన కొంతకాలానికే చనిపోయాడు. భర్త మరణం తర్వాత రమ్య తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే రాజుతో పాత పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో రాజు పెళ్లిచేసుకుందామని రమ్యను ఒత్తిడి చేస్తున్నాడు. ఈ విషయంపై ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక ఆ జంట బుధవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ.. గురువారం ధర్మారం గ్రామ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతంలో ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు.

Next Story