మిస్‌లీడింగ్ యాడ్.. రూ.30 లక్షల ఫైన్

by  |
మిస్‌లీడింగ్ యాడ్.. రూ.30 లక్షల ఫైన్
X

దిశ, వెబ్‌డెస్క్‌: కరోనా వైరస్‌‌ను అంతమొందించడానికి డాక్టర్లు, సైంటిస్ట్‌లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తే, కొన్ని కంపెనీలు మాత్రం ఆ కరోనానే తమ మార్కెటింగ్ స్ట్రాటజీకి ఉపయోగించుకున్నాయి. ‘ఇమ్యూనిటీ పవర్’ పెరిగితే.. కరోనా‌ను నుంచి సేవ్ కావచ్చంటూ తమ ఉత్పత్తులకు ‘ఇమ్యూనిటీ బూస్టర్స్’ అనే ట్యాగ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. పేస్ట్ నుంచి పెయింట్ వరకు అన్నింట్లోనూ కరోనా కిల్లర్ ఉందంటూ ప్రచారం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ బట్టలు వేసుకుంటే కరోనా అంతమవుతుందని వెల్లడించాయి. అయితే ఇందులో ఎంత నిజముందో.. కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా మనల్ని మిస్ లీడ్ చేసే వాటిపై కంప్లయింట్ ఇచ్చే తీరిక, ఓపిక ఎవరికీ ఉండవు. మనదేశంలో ఇలాంటివి చల్తా హై అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నా, విదేశాల్లో మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్రకటనలపై భారీ జరిమానా విధిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్పోర్ట్స్ ‌వేర్ బ్రాండ్‌పై భారీ మొత్తంలో ది ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కంజ్యూమర్ కమిషన్(ఏసీసీసీ) జరిమానా విధించింది.

‘కొవిడ్-19 వ్యాప్తి నిరోధించాలనుకుంటున్నారా? లోర్నా జేన్ గురించి ఆలోచించండి’ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ వేర్ క్లాత్ బ్రాండ్ ‘లోర్నా జేన్’ కంపెనీ తన స్టోర్ల దగ్గర మాత్రమే కాకుండా, ఇతర చోట్ల కూడా వాణిజ్య ప్రకటనలిచ్చింది. అంతేకాదు ఎల్‌జే షీల్డ్ అనే యాంటీ వైరస్ పదార్థాన్ని తమ సంస్థ తయారుచేసే దుస్తులపై చల్లడం వల్ల అది కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని ప్రచారం చేసింది. దాంతో లోర్నా జెన్ ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందంటూ ఆస్ట్రేలియాకు చెందిన మరో కంపెనీ..ఏసీసీసీని ఆశ్రయించింది. ‘ఆస్ట్రేలియాలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతారు. బ్రాండ్లపై ప్రజలకు ఓ నమ్మకముంటుంది. అందుకే ఇలా తప్పుడు ప్రకటనలు చేస్తే అది సమాజానికి మంచిది కాదు’ అని ఏసీసీసీ వ్యాఖ్యనించింది. కంపెనీపై 40 వేల డాలర్ల (రూ.30 లక్షల) జరిమానా విధించింది. ‘ఏసీసీసీ మాపై చేస్తున్న ఆరోపణలకు ఫెడరల్ కోర్టులో మేం డిఫెన్స్ చేసుకుంటాం’ అని లోర్నా జెన్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

Next Story

Most Viewed