రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కలిసికట్టుగా పని చేద్దాం : వంశీచందర్ రెడ్డి

by Disha Web Desk |
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కలిసికట్టుగా పని చేద్దాం : వంశీచందర్ రెడ్డి
X

దిశ, దేవరకద్ర: పది సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండి కాంగ్రెస్ జెండా మోసి పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అందించిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల సమావేశానికి వంశీచందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

దేశం కోసం దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు దార పోశారు. సోనియా గాంధీ అధికారాన్ని లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.. ఆ కుటుంబం నుండి వచ్చిన మన రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేయడానికి చెమటోడుస్తున్నారు. దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని తెస్తున్నారు.. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. దేశ సంపదను అంతా అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులకు దోచిపెట్టింది. అటువంటి ప్రభుత్వాన్ని పారద్రోలి దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందించే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెప్పించుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు అందరూ పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మీరంతా కలిసికట్టుగా పని చేయడం ద్వారా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారంతా విజయం సాధించారు. మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకలిగారు. ఇదంతా మీ కృషి వల్లే సాధ్యం అయింది. ఇప్పుడు మళ్లీ పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలలోను పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలాన్ని మరింత పెంచుదామని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ మరువదు. తప్పకుండా న్యాయం చేస్తుంది. మీరందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాసరెడ్డి, శ్రీహరి, పర్ణిక రెడ్డి, అనిరుద్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed