ఒకరిది ఆత్మహత్య, మరొకరు కరోనాతో.. బీజేపీకి ఒకే రోజు రెండు విషాదాలు

by  |
ram swaroop sharma and dilip gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలకు బుధవారం రెండు విషాదాలను మిగిల్చింది. ఇవాళ ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు మరణించారు. వారిలో ఒకరు మండి (హిమాచల్‌ప్రదేశ్) ఎంపీ రామ్ స్వరూప్ శర్మ (62) కాగా.. మరొకరు కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ. ఇటీవలే కరోనా బారీన పడ్డ దిలీప్ గాంధీ (69).. ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

అహ్మదాబాద్ దక్షిణ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన దిలీప్ గాంధీ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన మరణంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.

ఇక బీజేపీ ఎంపీ, మండి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్ స్వరూప్ శర్మ బుధవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 1958, జూన్ 10న మండి జిల్లాలోని జల్పెహర్ గ్రామంలో జన్మించిన రామ్ స్వరూప్.. 2014 నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

లోక్‌సభ వాయిదా..
రామ్ స్వరూప్ శర్మ, దిలీప్ గాంధీల హఠన్మారణంతో లోక్‌సభ వాయిదా పడింది. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సభను ఒంటిగంట దాకా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభ మాత్రం కొనసాగుతున్నది.

Advertisement
Next Story

Most Viewed