ఈ ఊళ్లకే ముప్పు.. ఎందుకు?

by  |
ఈ ఊళ్లకే ముప్పు.. ఎందుకు?
X

దిశ ప్రతినిధి, మెదక్ : మిడతలు ఇటు అధికారుల్లో, అటు రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసలే వర్షకాలం కావటం, ఇప్పుడిప్పుడే రైతులు పంట పొలాలు సాగుచేసి విత్తనాలు వేశారు. కొన్ని ప్రాంతాల్లో విత్తనం మొలకెత్తి కాండం దశకు చేరుకుంటోంది. ఈ సమయంలో మిడతలు కలకలం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మిడుతలు పంటలపై దాడి చేశాయి. ఈ మిడతలు ఎక్కడినుంచి వచ్చాయి, వాటి స్థాయి ఎలా ఉందనే అంశాలపై అధికారులు ఆరా తీశారు.

కర్నాటక, మహారాష్ర్ట బార్డర్ల మీదుగా..

కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ల మీదుగా మిడుతలు ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర బార్డర్ల ద్వారా జిల్లాలోని దాదాపు 33 గ్రామాల్లోకి మిడతలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు జిల్లా యంత్రాంగం గత నెలలో గుర్తించింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వాటిని అంతమొందించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌లు పోలీసు, అగ్నిమాపక, వ్యవసాయ, ఉద్యానవన, అటవీ, పంచాయతీ శాఖల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిడతలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. ప్రస్తుతం మిడతలను ఎదుర్కొనేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలను తయారు చేసే పనిలో ఆయా శాఖల ఆఫీసర్లు నిమగ్నమయ్యారు.

గాలివాటంతో..

గాలివాటం ఆధారంగా ప్రవేశించే మిడతల దండు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు తెలిసింది. ఏ రోజుకుకారోజు గాలిని బట్టి పరిస్థితులు మారవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత గాలివాటం ప్రకారం మిడతల దండు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోందని ఆ శాఖ పేర్కొంది. దీంతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న వనరులు, సామగ్రిపై నివేదికలు తయారు చేయించారు అధికారులు. మరోవైపు గ్రామాలు, మండలాల వారీగా గ్రూప్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల వారీగా ఇన్వెంటరీ తయారు చేసుకోవడం, హ్యాండ్ స్ప్రేయర్లు, జెట్టి మిషన్స్, రసాయనాలు, ఫైరింజన్ వాహనాలు, రసాయనాల స్ప్రే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లను అందుబాటులో ఉంచారు. 33 గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు, ఏఈవోలు, వీఆర్వోలు, ఫైర్‌‌ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల జాబితా మ్యాప్‌లను రెడీగా ఉంచారు.

ఈ ఊళ్లకే ముప్పు..

సంగారెడ్డి జిల్లాలో 33 గ్రామాల్లో మిడతల దండు అటాక్ చేసే ఛాన్స్ ఉన్నట్టు ఆఫీసర్లు గతంలో గుర్తించారు. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో కర్ణాటక సరిహద్దు గ్రామాలైన నాగల్‌గిద్ద మండలంలో ఔదత్‌పూర్, గొడేగావ్‌వాడ, కరస్‌గుత్తి, ఏస్గీ, కారముంగి, షాపూర్, శాంతి‌నగర్ తండా, మొర్గి, కంగ్తి మండలం దేగుల్‌వాడి, చందర్ తండా, సిద్ధన్ గిర్గా, నాగూర్ కె, బాబుల్ గావ్, జహీరాబాద్ డివిజన్‌లోని మొగుడంపల్లి మండలం గౌసాబాద్ తండా, ధనశ్రీ, మాడిగీ, జాడి మల్కాపూర్, ఔరంగానగర్, జహీరాబాద్ మండలం సత్వార్, చిరాగ్ పల్లి, బుర్ధిపాడ్, బుచినెల్లి, కోహిర్ మండలం సిద్దాపూర్ తండా, మనియార్‌పల్లి, న్యాల్కల్ మండలం శంషల్లాపూర్, రాజోల, మాలీగి, హుస్సేన్ నగర్, కల్బెమల్, డప్పూర్, రత్నాపూర్, హూసెళ్లి, గణేశ్‌పూర్ గ్రామాలకు మిడతల దండు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుల అంచనా. ఈ గ్రామాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆఫీసర్లకు సూచించారు.

దేగుల్ వాడిలో హై అలర్ట్

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దేగుల్ వాడి గ్రామంలో చాలా వరకు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న వారే ఎక్కువ. కర్ణాటక బార్డర్‌‌కు ఈ ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా, మహారాష్ట్ర బార్డర్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలోకి మిడతల దండు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు ఊళ్లో చాటింపు వేయించారు. ఈ గ్రామంలో తిరుగుతూ పల్లె జనాన్ని చైతన్య పరుస్తున్నారు. నాలుగు రోజులుగా ముందు జాగ్రత్తలపై ఆఫీసర్లు హడావుడి చేస్తుండడంతో గ్రామంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed