ఎనిమిది నెలల కనిష్టానికి సేవల రంగం..

by  |
ఎనిమిది నెలల కనిష్టానికి సేవల రంగం..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా సేవల రంగం కరోనా సెకెండ్ వేవ్ మహమ్మారి కారణంగా మరోసారి కుదేలైంది. మే నెలకు సంబంధించి సేవల రంగం పీఎంఐ 8 నెలల కనిష్టానికి తగ్గినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక వెల్లడించింది. ఈ రంగం పీఎంఐ సూచీ 50 పాయింట్లకు దిగువకు పడిపోవడంతో ఉద్యోగాలు సైతం క్షీణించాయని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా పరిణామాల కారణంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో ఎనిమిది నెలల అనంతరం సేవల రంగంలో కార్యకలాపాలు సగటు కంటే దిగువన నమోదైనట్టు పేర్కొంది. ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక ప్రకారం… సేవల రంగం పీఎంఐ ఏప్రిల్‌లో 54 నమోదవగా, మే నెలలో ఇది 46.4 పాయింట్లకు తగ్గింది.

అంతర్జాతీయంగా కూడా భారత సేవల రంగంలో డిమాండ్ క్షీణించింది. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి ఆంక్షలు కొనసాగుతుండటం, వ్యాపారాలు నిలిచిపోవడమే దీనికి ముఖ్య కారణమని నివేదిక వివరించింది. కొవిడ్ ఆందోళన, విక్రయాల్లో క్షీణత కారణంగా సేవల రంగంలోని అనేక కంపెనీలు సిబ్బందిని తగ్గించుకున్నాయని, అందుకే ఈ రంగంలో ఉపాధి దెబ్బతిన్నట్టు తెలిపింది. కంపెనీల వ్యాపార అంచనాలు తొమ్మిది నెలల కనిష్టానికి తగ్గిపోవడంతో రాబోయే నెలల్లో కంపెనీలు ఉద్యోగుల వేతనాలను తగ్గించవచ్చని ఐహెచ్ఎస్ మార్కిట్ అభిప్రాయపడింది.



Next Story

Most Viewed