‘ప్రజల ప్రాణాలు తీస్తున్న లాక్‌డౌన్’

by  |
‘ప్రజల ప్రాణాలు తీస్తున్న లాక్‌డౌన్’
X

బ్రెసిలియా: కరోనా కట్టడి చర్యలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని, లాక్‌డౌన్‌లు హతమారస్తున్నాయని ప్రపంచంలో అత్యధిక కేసులున్న రెండో దేశం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఇతర కట్టడి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయని చెప్పారు. లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాలను ఉఠంకిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు, వేతనాలు లేక ప్రజలు మరణిస్తారని, లాక్‌డౌన్‌లు పొట్టనబెట్టుకుంటాయని అన్నారు. బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ 6.4శాతం మేర కుచించుకుపోయే అవకాశమున్నదని అంచనాలు వెలువడ్డ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 7వ తేదీన కరోనా సోకినట్టు నిర్ధారణ అయిన అధ్యక్షుడు బోల్సోనారో మొదటి నుంచి కరోనాను తక్కువగా చూపుతూ వ్యాఖ్యలు చేయడంపై విమర్శలపాలయ్యారు. సామాజిక దూరాన్ని ఆయన బేఖాతరు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాగా, కేసుల్లో నెంబర్ 2 బ్రెజిల్ దేశాధ్యక్షుడు మహమ్మారిని ఖాతరు చేయకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుండగా, నెంబర్ 1 దేశం అమెరికా అధ్యక్షుడూ కరోనాను తక్కువ చూపేవిధంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా మాస్క్ ధరించడానికి ఇష్టపడని డొనాల్డ్ ట్రంప్ ప్రజలనూ ధరించాలని ఆదేశింబోరని వ్యాఖ్యానించి దుమారం రేపారు.


Next Story