ఎల్బీనగర్ మార్కెట్ స్టేడియంలోకి మార్పు: మంత్రి నిరంజన్‌రెడ్డి

by  |
ఎల్బీనగర్ మార్కెట్ స్టేడియంలోకి మార్పు:  మంత్రి నిరంజన్‌రెడ్డి
X

దిశ, రంగారెడ్డి: ఎల్బీనగర్‌లోని కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా సరూర్ స్టేడియంలోకి తరలించడానికి చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి తగిన ఏర్పాట్లకు సూచనలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, పలు ఖాళీ ప్రదేశాలకు కూరగాయల మార్కెట్లు తరలిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయలు అందిస్తున్నామని చెప్పారు. ఆయా అపార్ట్ మెంట్లు, కాలనీ వాసుల నుంచి నాలుగు రోజులుగా మంచి స్పందన లభిస్తుందన్నారు. కూరగాయలు కావాల్సిన కాలనీ, అపార్ట్‌మెంట్ల వాసులు 7330733212 నంబరుకు కాల్ చేసి నమోదు చేసుకుంటే వాహనం వచ్చే సమయం చెబుతారని తెలిపారు. మొబైల్ రైతుబజార్ నడపాలనుకుంటున్న యువకులు, ఇతరులూ ఈ నంబరును సంప్రదించవచ్చు అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలి అన్నారు. అనంతరం గడ్డిఅన్నారంలోని పండ్ల మార్కెట్‌ను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విరమల్ల రాంనరసింహాగౌడ్ ఉన్నారు.

Tags: lock down, lb nagar, vegetable market, shifted, sarror nagar ground

Next Story

Most Viewed