రుణమాఫీకి రూ.1200 కోట్లు విడుదల

by  |

• వానాకాలం రైతుబంధు సొమ్మూ రిలీజ్
• సమీక్షలో ఆర్థిక, వ్యవసాయ మంత్రులు

దిశ, న్యూస్ బ్యూరో :
రైతు రుణాల మాఫీకి రూ. 1200 కోట్ల‌ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. రూ.25 వేల లోపు వ్యవసాయ రుణాలున్న 6 లక్షల 10 వేల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని జమచేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్య భవన్‌లో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి 4 విడతలుగా రుణ చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. రుణమాఫీకిగాను అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆర్థిక, వ్యవసాయ‌శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. వానా‌కాలం పంటకు రైతు బంధు సాయం పైనా ఈ సందర్భంగా మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ నెలలో వానాకాలం పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు డబ్బులను వారి అకౌంట్లలో జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

సీఎం కేసీఆర్ గత కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇతర ఖర్చులు తగ్గించుకునైనా.. రైతుబంధు డబ్బులను పంటలు వేయడానికి ముందే రైతుల ఖాతాల్లో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 51 లక్షల మంది రైతులకు రైతు బంధు డబ్బు వారి ఖాతాల్లోనే జమవుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రులు హరీశ్ రావు, నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. సమీక్షలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌రెడ్డి, ఆర్థిక , వ్యవసాయ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: telangana, loan waiver, rythu bandhu, agriculture, finance, review



Next Story

Most Viewed