నైట్ కర్ఫ్యూ.. రెట్టింపు ధరలకు మద్యం విక్రయాలు

by  |
నైట్ కర్ఫ్యూ.. రెట్టింపు ధరలకు మద్యం విక్రయాలు
X

దిశ ప్రతినిధి,హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూను సైతం కొంత మంది మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా తెలంగాణలో ప్రభుత్వం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా రాత్రి ఎనిమిది గంటలకే దుకాణాలను మూసివేయవలసి ఉంది. దీనిని మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దుకాణం మూసి వేయక ముందు మద్యం నిల్వలు తీసి పక్కన పెట్టి అనంతరం అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు తమ దగ్గర పని చేసే వారిని వినియోగించుకుంటున్నారు.

రెట్టింపు ధరలకు..

రాత్రి ఎనిమిది గంటల అనంతరం హైదరాబాద్ నగరంలో వైన్స్‌లు, బార్ షాప్‌లు మూతపడుతుండడం అక్రమ మద్యం వ్యాపారులకు వరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం నిల్వలు తీసి పెట్టుకుని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కర్ఫ్యూ మొదలయ్యే వరకు దుకాణం సమీపంలో, అనంతరం అక్కడి నుండి మకాం మార్చి మద్యం అమ్ముతున్నారు. పలు రకాల కారణాలతో దుకాణాలు మూసి వేసే సమయానికి మద్యం కొనుగోలు చేయలేని వారు తప్పని సరి పరిస్థితులలో వారు అడిగినంత ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎమ్మార్పీ కన్నా రెండు, మూడింతలు అధికంగా విక్రయిస్తూ మందుబాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

పోలీసులకు తెలిసినా..?

వైన్స్‌లు, బార్‌లు మూసిన అనంతరం బెల్టు దుకాణాలలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కో కొల్లలుగా వినబడుతున్నాయి. మద్యం దుకాణ యాజమన్యాలు బెల్ట్ షాప్ నిర్వాహకులతో కుమ్మక్కై రాత్రి సమయంలో మద్యం విక్రయాలు చేయిస్తున్నారని తెలిసింది. వీరి నుండి ముడుపులు అందుతున్న కారణంగా పోలీసులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు త్వరగా మూసి వేస్తుండడాన్ని అవకాశంగా తీసుకుని ఇష్టారాజ్యంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

రెట్టింపు ధరలకు కొనుగోలు చేశాను.. కొనుగోలుదారుడు

ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట నుండి నాగోల్ వైపు వెళ్లే దారిలో ఉన్న వైన్ షాప్ వద్దకు రాత్రి 8.10 గంటల సమయంలో మద్యం కోసం వెళ్లాను. అయితే అప్పటికే దుకాణాం మూసి వేశారు. దుకాణం ముందు కొంత మంది మద్యం అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితులలో రూ. 160 ఎమ్మార్పీ ఉన్న మద్యం సీసాను రూ. 320 చెల్లించి కొనుగోలు చేశాను . ధర తగ్గించమని కోరినా వాళ్లు ససేమిరా అన్నారు. గత్యంతరం లేక వారు అడిగినంత ఇచ్చుకుని కొనుక్కుని వెళ్లాను. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.



Next Story