చెంచు గిరిజనుడు.. నిమ్మల లింగయ్య మృతి

by  |
Lingaya, tribal
X

దిశ, అచ్చంపేట: గత వారంరోజుల క్రితం నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం మల్లాపూర్ చెంచుపెంటలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ మంటల్లో ఆదివాసీ గిరిజనులు చిక్కుకొని 11 మందికి పైగా గాయాలయ్యాయి. అంతేగాకుండా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి, నలుగురిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిమ్మల లింగయ్య(40) అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మృతిచెందాడని బంధువులు తెలిపారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె, భార్య లింగమ్మ ఉన్నట్టు వెల్లడించారు. లింగయ్య ఇటీవలే బతుకుదెరువు కోసం బల్లాపూర్ పెంటకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Next Story