తాబేళ్లకు ప్రాణం పోసి పర్యావరణాన్ని కాపాడుతున్నారు.!

by Daayi Srishailam |

తాబేళ్ల కోసం తండ్లాట

తాబేళ్లకు ప్రాణం పోసి పర్యావరణాన్ని కాపాడుతున్నారు.!
X

పర్యావరణం బాగుంటే..

మనం బాగుంటం.

మన జీవన విధానం బాగుంటుంది.

భూమ్మీదుండే జీవరాశుల బతుకు బాగుంటుంది.

మనకు ప్రాణమ్మీద తీపి ఉంటది కానీ..

దానికి కూడా ప్రాణం పోసే పర్యావరణం మీద కొంచెం కూడా ఉండదు.

మేం ఒక్కరమే ఉన్నామా.?

మా పనులు మాకు చాలా ఉన్నాయి.. అనుకుంటాం.

కానీ.. అందరూ అలా ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షకులెవరూ.?

వాళ్ల గురించే ఈ స్టోరీ.!

- దిశ, ఫీచర్స్

ఉష్ణమండల సముద్ర తాబేళ్లలో చిన్న సమూహం "ఆలివ్ రిడ్లీ తాబేళ్లు". పర్యావరణ వ్యవస్థలో ఇవి అత్యంత కీలకమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి పనులు వాళ్లు చేసుకుంటుంటే.. కొందరు యువకులు మాత్రం ఆ తాబేళ్లను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నారు.

తాబేళ్ల విప్లవం

చెన్నయ్‌లోని "స్టూడెంట్స్ సీ టర్టల్ కన్సర్వేషన్ నెట్ వర్క్" (ఎస్ఎస్‌టీ‌సీఎన్) సంస్థ ఆధ్వర్యంలో తాబేళ్ల గుడ్లను సముద్రం నుంచి వేరుచేసి హచరీస్‌కు తీసుకెళ్తారు. గుడ్లు పొదిగి.. పిల్లలు అయ్యాక వాటిని తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడుదల చేస్తారు. వాళ్లు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మనుగడ.. జీవనరేటులో గణనీయమైన మార్పులు వచ్చాయి. పర్యావరణ కోణంలో చూస్తే ఇదొక గొప్ప విప్లవం లాంటిది. యువతలో పర్యావరణ అవగాహనను పెంచుతూ సముద్రాల వెంట రాత్రివేళల్లో "పబ్లిక్ వాక్స్" నిర్వహిస్తున్నారు.

ఎందుకీ ఆరాటం.?

"ఆలివ్ రిడ్లీ" తాబేళ్లు సముద్ర పర్యావరణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తాయి. అవి పొదిగే క్రమంలో "జెల్లీఫిష్" వంటి సముద్ర జీవులను తింటాయి. దీనివల్ల "జెల్లీఫిష్" వంటి సముద్ర జీవుల జనాభా తగ్గిపోతుంది. అది సముద్ర జీవులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆ దశలో ఇటు తాబేళ్లను.. అటు సముద్ర జీవులను సమన్వయం చేస్తూ నియంత్రణలో పెట్టేందుకే ఈ పబ్లిక్ వాక్స్. తాబేళ్లు ఎక్కడయితే గూళ్లు కట్టుకుంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి.. రక్షించి సముద్ర తీర పర్యావరణ వ్యవస్థలను కాపాడుతున్నారు. ఇది ఇతర జీవులకు కూడా ప్రయోజనకరం.

కాలుష్యమూ కారణమే

తీరప్రాంత అభివృద్ధి.. కాలుష్యం.. మత్య్స సంపద సేకరణ వల్ల ఆలివ్ రిడ్లీ గూళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. ఫిషింగ్ నెట్లలో చిక్కుకోవడం వల్ల చాలా తాబేళ్లు చనిపోతాయి. గుడ్లు.. పిల్లలు పీతల్లాంటి ప్రిడేటర్స్‌కు ఆహారంగా మారతాయి. ప్లాస్టిక్.. చెత్తగూళ్ల వల్ల గూడుకట్టే ప్రాంతాలు నాశనం అవుతాయి. వీటన్నింటి నుంచి తాబేళ్లను.. పర్యావరణాన్ని.. సముద్ర జీవులను కాపాడేందుకు వాక్స్ నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్‌టీ‌సీఎన్ వలంటీర్లు. సముద్ర నిశ్చలత మధ్య తాబేలు గుర్తించడం అనేది పులి గాయాను గుర్తించడం లాంటిది అని అంటున్నారు వాళ్లు.

రాత్రుల త్యాగం

ప్రతిరాత్రి చెన్నయ్ నగరమంతా నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకుంటుంది. కానీ ఎస్ఎస్‌టీ‌సీఎన్ వలంటీర్లు ఆ అందమైన రాత్రులను త్యాగం చేసి సముద్ర తీరంలో గుమిగూడి ఫ్లాష్‌లైట్లతో ఇసుకలో గూడుకట్టే తాబేళ్ల సంకేతాల కోసం వెతుకుతారు. జనవరి- మే మధ్యలో తాబేలు గూడు కడుతుంది. వాటిని గుర్తించేందుకు ప్రతిరోజూ నలుగురు చొప్పున వాక్స్‌కు వెళతారు వలంటీర్లు. ఇద్దరు ఒకవైపు.. ఇద్దరు ఇంకోవైపు నీలంగరై నుంచ బెసంత్ నగర్ వరకు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అలా నడుస్తూనే ఉంటారు.

గుడ్ల సేకరణ

తల్లి తాబేలు గూడు తవ్వడానికి ఒక డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత గుడ్లు పెట్టేటప్పటి నొప్పిని అధగమించేందుకు ఒక ట్రాన్స్‌లోకి వెళ్తుంది. ఆ సమయంలో తాబేలు దగ్గరికి వెళ్లొద్దు. గూడును మూసేయడానికి మళ్లీ డ్యాన్స్ చేస్తుంది. ఆ ప్రక్రియ తర్వాతే ఒక స్టెప్ తీసుకోవాలి. ఒకొక్కసారి 40-50 నిమిషాలు కూడా పట్టొచ్చు. ప్రోబ్ స్థానాన్ని గుర్తించిన తర్వాత లోపలికి చేయి పట్టేలా 20 సెంటీమీటర్ల వరకు రంధ్రం చేసి గుడ్లను జాగ్రత్తగా తీస్తారు. ప్రతి శుక్ర.. శనివారాల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తారు వాళ్లు. గుడ్లు గట్టిపడకముందే త్వరగా హ్యచరీస్‌కు మార్చుతారు.

తిరిగి సముద్రంలోకి

హ్యాచరీని 24/7 పర్యవేక్షించాలి. గుడ్లు పొదిగి పిల్లలు ఎప్పుడైనా బయటకు రావచ్చు. పగటిపూట వాటిని త్వరగా విడుదల చేయాలి. ఎందుకంటే ఉష్ణోగ్రత 35- 38 డిగ్రీలకు పెరుగుతుంది. పుట్టినప్పుడు పిల్లలు 3 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. అవి ఈ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. వేడి ఎక్కువైతే చనిపోతాయి. పిల్లలు విడుదలైన తర్వాత చెత్తను తొలగించే కీటకాలను గూడు నుంచి దూరంగా ఉంచడానికి చనిపోయిన గుడ్లను తీసేయాలి. కొన్నిసార్లు పిల్లలు రూట్స్‌లో చిక్కుకుపోతాయి. వీటన్నింటినీ శ్రద్ధగా నిర్వహించి పిల్లలను సముద్రంలోకి క్షేమంగా వదిలేసి పర్యావరణాన్ని కాపాడుతారు.

Next Story