అంతరించిపోతున్న కళలకు.. ప్రాణం పోస్తున్న యోషా.!

by Daayi Srishailam |

తీరొక్క కళలు ఇక్కడ ప్రాణం పోసుకున్నాయి

అంతరించిపోతున్న కళలకు.. ప్రాణం పోస్తున్న యోషా.!
X

దిశ, ఫీచర్స్: ఇండియా కళలకు పుట్టినిల్లు లాంటిది. తీరొక్క కళలు ఇక్కడ ప్రాణం పోసుకున్నాయి. ఐతే.. విస్తరిస్తున్న టెక్నాలజీ.. మారుతున్న మనిషి జీవనశైలి కారణంగా కళలు కనుమరుగవుతున్నాయి. అలాంటి అంతరించిపోతున్న కళలకు తిరిగి ప్రాణం పోస్తోంది యోషా గుప్తా.

కోట్ల రూపాయల ప్రాజెక్టులు..

అంతరించిపోతున్న కళలకు పునరుజ్జీవం పోస్తూ కళాకారులను అక్కున చేర్చు్కుంటోంది యోషా గుప్తా. దీనికోసం మెమెరాకి అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. మెమెరాకి ద్వారా దేశమంతా తిరిగి వందలాది మాస్టర్ కళాకారులతో కలిసి పనిచేస్తోంది. అంతరించిపోతున్న కళా సంప్రదాయాలను రికార్డు చేస్తూ వాటిని తిరిగి ప్రజలకు దగ్గర చేస్తోంది. కళల్ని మళ్లీ మనిషికి దగ్గర చేస్తూ ఇటు కళాకారులను ఆదుకుంటోంది. మెమెరాకి వేదిక ద్వారా అలాంటి కళాకారులకు గత ఐదేళ్లలో నేరుగా ఏడు కోట్ల రూపాయల వరకు చెల్లించింది యోషా. ఆమె అందిస్తున్న సాయం వల్ల దళారులపై ఆధారపడాల్సిన అవసరం లేదు కళాకారులకు.

జాతీయ స్టార్టప్ అవార్డు..

యోషా 15 ఏళ్లపాటు విదేశాల్లో ఉన్నది. అక్కడ ఉన్నంతసేపు తరుచూ మన కళలు.. సంస్కృతులే గుర్తుకొచ్చేవి. సంప్రదాయ కళలను ఆధునిక ప్రపంచంలో సజీవంగా ఉండేలా చేయడమే తన లక్ష్యం. లైవ్ డిజిటల్ వర్క్‌షాప్‌లు ఎన్నో చూపించి ఉపాధి కల్పిస్తోంది. ఆమె అందించిన సేవలను గుర్తించిన సెంట్రల్ సర్కారు జనవరి 16 రోజున జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా మెమెరాకి వ్యవస్థాపకురాలైన యోషా గుప్తాకు జాతీయ స్టార్టప్ అవార్డు అందించాడు. మహిళలు నడిపే.. సమాజానికి నిజమైన మేలు చేసే స్టార్టప్‌లను గౌరవించాల్సిందిగా ప్రధాని నొక్కి వక్కానించారు.

300కి పైగా కళల్ని..

యోషాకు చిన్నప్పటి నుంచి హ్యాండ్‌మేడ్ వస్తువులంటే ఇష్టం. కళాకారులకు తగిన గౌరవం.. ఆదాయం లేకపోవడం చూసి బాధపడింది. మంచి వ్యవస్థలు నిర్మించి కళాకారులకు న్యాయం చేయాలని సంకల్పించి మెమెరాకిని స్థాపించింది. ఇప్పుడు 500కి పైగా కళాకారులు.. 300కి పైగా కళా సంప్రదాయాలతో పని చేస్తోంది. వర్క్‌షాప్‌లు.. ఆన్‌లైన్ మార్కెట్.. బీ2బీ ప్రాజెక్టులు.. ఎయిర్‌పోర్టులు.. హోటళ్లు.. కార్పొరేట్ కార్యాలయాల్లో మ్యూరల్స్.. ఇన్‌స్టలేషన్స్ చేస్తోంది. కళలను వస్తువులుగా కాకుండా గౌరవంగా ఉండేలా చూస్తోంది. భవిష్యత్తులో మరిన్ని కళలను డాక్యుమెంట్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Next Story