ఎలక్ట్రిక్ వెహికిల్స్ జర్నీతో.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్.!

by Daayi Srishailam |

పదేండ్ల క్రితమే ఈవీతో జర్నీ స్టార్ట్ చేశాడు సుశీల్ రెడ్డి

ఎలక్ట్రిక్ వెహికిల్స్ జర్నీతో.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్.!
X

దిశ, ఫీచర్స్: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌దే. ఇప్పటికే ఇదొక ట్రెండ్‌గా మారుతోంది. 2030 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్డుమీద తిరిగేలా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఒక్క 2024లో 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్లు ఒక నివేదికలో పేర్కొంది. అందుకే ఇప్పుడు కొత్తగా వెహికిల్స్ తీసుకునేవాళ్లు ఈవీపైనే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పదేండ్ల క్రితమే ఈవీతో జర్నీ స్టార్ట్ చేశాడు సుశీల్ రెడ్డి.


తొమ్మిది రాష్ట్రాల్లో..

ముంబైలో ఉండే సుశీల్ రెడ్డికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ మీద 2016లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఈ-సైకిల్‌తో 79 రోజుల్లో తొమ్మిది రాష్ట్రాలు తిరిగి 7424 కిలోమీటర్లు తిరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. వరల్డ్ రికార్డ్ సాధించిన తర్వాత సుశీల్ రెడ్డికి ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత నమ్మకం కలిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఉత్తమం అని అతడి నమ్మకం. పెట్రోల్, డీజిల్ వాహనాలకు నిర్వహణ ఖర్చు ఎక్కువ. ఇంకా త్వరగా దెబ్బతింటాయి. కానీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అలా కాదు. వీటి ఇంధన సామర్థ్యం 60-90 శాతం ఉండి ఇంధన వినియోగం సమర్థవంతంగా ఉంటుంది.


ఛార్జింగ్ భయం వద్దు..

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులను ఆందోళనకు గురిచేసే అంశం రేంజ్ యాంగ్జయిటీ. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంతదూరం వెళ్తుందనే భయం ఉంటుంది ఎవరికైనా. కానీ.. సుశీల్ ఇది పెద్ద సమస్యే కాదని అంటున్నాడు. 2022లో ఎంజీ జెడ్‌ఎస్ ఈవీతో గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రూట్‌లో 8,849 కిలో మీటర్లు పర్యటించాడు. ఇందులో 35 నగరాలు, 13 రాష్ట్రాలున్నాయి. ఈ ప్రయాణంలో అతడు కేవలం 12 సార్లు డీసీ ఫాస్ట్ ఛార్జర్‌లను వాడి రూ.2,851 ఖర్చుతో ఛార్జింగ్ పూర్తిచేశాడు. మిగిలిన సమయంలో 16 ఆంపియర్ సాకెట్‌తో రాత్రిపూట ఛార్జింగ్ చేశాడు.


ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్..

ఛార్జింగ్ సవాల్‌ను ఈజీగా ఎదుర్కోవచ్చని చెప్తున్నాడు సుశీల్. ప్లగ్‌షేర్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్ల మ్యాప్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. డిజిటల్ వాలెట్‌లో డబ్బు లోడ్ చేసి ఎన్ని యూనిట్ల ఎలక్ట్రిసిటీ కావాలో ఎంచుకోవచ్చని సూచిస్తాడు. ఫోర్టమ్ ఛార్జ్ అండ్ డ్రైవ్, యోఛార్జ్ వంటి యాప్‌లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ‘ఛార్జ్-త్రూ’ ప్రాసెస్ ఛార్జింగ్‌ను సులభతరం చేస్తుందంటున్నాడు. సుశీల్ 2025లో టాటా కర్వ్ వెహికిల్ తీసుకొని 10,027 కిలోమీటర్ల ప్రయాణంచేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఈ రెండు నెలల ప్రయాణంలో సూరత్, ద్వారకా, ఉదయ్‌పూర్, ఢిల్లీ, భోపాల్, ఇండోర్ వంటి 28 నగరాలను సందర్శించి, 25 యూనివర్సిటీలలో విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రాముఖ్యతను వివరించాడు.


అదే సుశీల్ సక్సెస్..

సగటున ఒక ఎలక్ట్రిక్ వాహనం పూర్తి ఛార్జ్‌తో 400 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఖర్చు ఎక్కువైనా.. దానిని నడపడంలో ఖర్చు తక్కువ అని చెప్తున్నాడు సుశీల్. పెట్రోల్, డీజిల్ వాహనాల కిలోమీటర్ ఖర్చు రూ.10 అయితే.. ఎలక్ట్రిక్ వాహనాలది రూ.3 మాత్రమే. ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కువ ఆదా అవుతుంది. ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 18,000కి చేరింది. హైవేల వెంట వేగవంతమైన ఛార్జర్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటన్నింటినీ సమర్ధవంతంగా వినియోగిస్తు్న్నాడు కాబట్టే సుశీల్ ప్రయాణాలు సక్సెస్ అవుతున్నాయి.. రికార్డులు సృష్టిస్తున్నాయి.

Next Story