- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిని కోల్పోయాడు.. కానీ 40వేల మందిని కాపాడాడు..
మన జీవితంలో జరిగిన నష్టం.. మరొకరి జీవితంలో జరగకూడదని కోరుకోవడం మంచితనం. అయితే ఆ నష్టాన్ని జరగకుండా చూస్తానని ముందుకు రావడం గొప్పతనం. వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక కళ్ల ముందే తన తల్లిని పోగొట్టుకున్న రామన్ కిశోర్ ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు.

దిశ, ఫీచర్స్ : మన జీవితంలో జరిగిన నష్టం.. మరొకరి జీవితంలో జరగకూడదని కోరుకోవడం మంచితనం. అయితే ఆ నష్టాన్ని జరగకుండా చూస్తానని ముందుకు రావడం గొప్పతనం. వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక కళ్ల ముందే తన తల్లిని పోగొట్టుకున్న రామన్ కిశోర్ ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. తన లాగా మరెవరూ తమకు ఇష్టమైన వారిని కోల్పోకూడదని సేవా మార్గాన నడుస్తున్నాడు ఈ బీహార్ డాక్టర్.
జీవితాన్ని మార్చేసిన ఘటన
డాక్టర్ రామన్ కిశోర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దగ్గరలో ఆస్పత్రి లేదు. సమయానికి డాక్టర్ రాలేదు. అతను ఏం చేయలేని పరిస్థితి. చివరకు కళ్ల ముందే తల్లిని కోల్పోయాడు. ఆ రోజు తల్లికి వాగ్దానం చేశాడు రామన్. తాను డాక్టర్ అయ్యాక సేవా మార్గంలో నడుస్తానని.. పేదలకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. చాలా మంది వ్యక్తిగత నష్టం నుంచి కోలుకోవడానికి జీవితాంతం ప్రయత్నిస్తారు. కానీ డా. రామన్ కిషోర్కు ఆ నష్టమే వేరొక జీవితాన్ని ఎంచుకోవడానికి కారణమైంది. ఆసుపత్రి దూరంగా ఉందన్న కారణంతో ఎవరూ తమ ప్రియులను కోల్పోకూడదని నిర్ణయించుకున్నాడు. సంవత్సరాల కష్టం తర్వాత.. తన గ్రామం నుంచి మొదటి డాక్టర్గా వచ్చిన డా. రామన్ సొంతంగా ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసి మంచి డబ్బు సంపాదించవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా.. అత్యంత అవసరం ఉన్నవారికి ఆరోగ్య సేవలు అందించాలని అనుకున్నాడు.
ఉచిత వైద్య శిబిరాలు
2020 నుంచి ప్రతి వీకెండ్లో బీహార్లోని అత్యంత దూర గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాడు. సాధారణంగా ఆరోగ్య సేవలు అందుబాటులో లేని ప్రజలకు చికిత్స అందిస్తున్నాడు. తన జీతంలో 80 నుంచి 90 శాతం ఈ శిబిరాలపై ఖర్చు చేస్తున్నాడు. మందులు, పరీక్షలు అన్నీ స్వయంగా భరించి.. ఎవరి నుంచీ విరాళాలు అడగకుండా సేవ చేస్తున్నాడు. రోగులు ఉచితంగా ECG, బ్లడ్ షుగర్ పరీక్షలు, మందులు, వైద్య సలహాలు అందుకుంటారు. ఇప్పటి వరకు 40,000 మందికి పైగా ఈ శిబిరాల ద్వారా చికిత్స పొందారు. చాలా కుటుంబాలకు సకాలంలో వ్యాధి నిర్ధారణ, ప్రాణాలు కాపాడే చికిత్స, ఇతరులు రాలేనప్పుడు ఎవరో వస్తారన్న భరోసా లభించింది. అలాంటి వారు.. ‘డాక్టర్ సాబ్.. మీరు నా ప్రాణం కాపాడారు’ అని చెప్పినప్పుడు ఆయనకొక సంతృప్తి కలుగుతుంది. తల్లిని కోల్పోయిన తర్వాత చేసిన వాగ్దానాన్ని, ఆ నొప్పిని వదలకుండా ముందుకు వెళ్లడం వల్ల మారిన ఎన్నో జీవితాలను గుర్తు చేస్తుంది.






