చదివింది ఎంబీఏ.. చేస్తున్నది వ్యవసాయం..! కట్ చేస్తే రూ. 4 కోట్ల టర్నోవర్

by Javid Pasha |   (  Updated:2026-04-13 08:54:41  IST  )

అగ్రి‌బిజినెస్ మేనేజ్మెంట్‌లో ఎంబీఏ చేసిన ఆమె.. కార్పొరేట్ ఉద్యోగం వదిలి, సాంప్రదాయ వ్యవసాయంలో అడుగ పెట్టింది. రూ. 4 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.

చదివింది ఎంబీఏ.. చేస్తున్నది వ్యవసాయం..! కట్ చేస్తే రూ. 4 కోట్ల టర్నోవర్
X

దిశ; ఫీచర్స్ : కొందరు చదువుకున్నోళ్లు వ్యవసాయం చేయడానికి నామోషీగా ఫీలవుతుంటారు. ఇంత చదువూ చదివి మట్టిలో పనిచేయాల్నా అనేది వారి ఫీలింగ్. పట్నంబోయి ఏదో ఒక జాబ్ చేసుకుంటే దర్జాగా బతకొచ్చు అనుకుంటారు. మరికొందరు ఇందుకు భిన్నం. ప్రపంచానికి అన్నంపెట్టేది వ్యవసాయమే కదా అనుకుంటారు. అందుకే ఎంత చదువుకున్నా, ఊర్లో కాస్త పొంలం ఉంటే చాలు.. వ్యవసాయం చేస్తూ నచ్చినట్లు బతుకుతూ ఇతరులకు సహాయపడాలనుకుంటారు. ఈ రెండవక కోవకు చెందిన వ్యక్తే ప్రణీత వామన్. అగ్రి‌బిజినెస్ మేనేజ్మెంట్‌లో ఎంబీఏ చేసిన ఈమె కార్పొరేట్ ఉద్యోగం వదిలి, సాంప్రదాయ వ్యవసాయంలో అడుగ పెట్టింది. క్యాప్సికం పండిస్తూ ఏడాదికి రూ. 4 కోట్ల టర్నోవర్ సాధిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె సక్సెస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఉద్యోగం వదిలి.. వ్యవసాయంలోకి..

ప్రణీత వామన్ స్వగ్రామం కల్వాడి. ఇది మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఉంది. ఇక్కడే ప్రజెంట్ అగ్రి-ఎంట్రపెన్యూర్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్నది ప్రణీత. 2019లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ప్రణీత ఆ తర్వాత, కార్పొరేట్ ఉద్యోగం సంపాదించుకుంది. కానీ తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయ రంగంలో అడుగుపెట్టింది. అప్పటికే ఆమె కుటుంబం సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నప్పటికీ, ప్రణీత మరో కొత్త ఆలోచనతో దానిని లాభసాటిగా మార్చాలనుకుంది. 2020లో మార్చి నెలలో 1 ఎకరంలో మొదటి క్యాప్సికం (Bell pepper) పాలీహౌజ్‌ను స్థాపించింది. 50% ప్రభుత్వ సబ్సిడీతో సుమారు 20 లక్షలు పెట్టుబడి పెట్టి, డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్, ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సైతం అప్లయ్ చేసి.. మొదటి సంవత్సరమే క్యాప్సికం పంట ద్వారా రూ. 10 లక్షల లాభాన్ని సాధించింది ప్రీణీత.

సాంకేతికతతో లాభాల పంట..

మొదటి సంవత్సరమే మంచి లాభాలు రావడం ప్రణీతకు వ్యవసాయంపై మరింత నమ్మకం కుదరింది. ఆధునిక సాంకేతికతను అప్లయ్ చేస్తే ఇక్కడ కూడా మంచి లాభాలు వస్తాయని భావించింది. 2021 నుంచి తన ప్రణాళికను మరింత విస్తృతంగా అమలు చేసింది. క్రమంగా పంటలను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం 10 ఎకరాల తన సొంత పొలంలో, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకొని మొత్తం 25 ఎకరాల్లో క్యాప్సికం సాగు చేస్తూ లాభాల పంట పండిస్తోంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల బెల్ పెప్పర్ క్యాప్సికం పండించి, పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లకు సప్లై చేస్తూ ఏడాదికి రూ. 4 కోట్ల టర్నోవర్ సాధిస్తుండగా.. అన్నీ పోను సుమారు రూ.2.25 కోట్లు లాభం వస్తోంది. స్థానిక మట్టి, వెర్మికంపోస్ట్, బయోఫెర్టిలైజర్లు, ఫెర్టిగేషన్ వంటి పద్ధతులతో నాణ్యత గల పంటను పండిస్తూ.. కాస్త భిన్నంగా ఆలోచిస్తే వ్యవసాయం కూడా కార్పొరేట్ రంగంకంటే లాభదాయకంగా ఉంటుందని నిరూపించిన ప్రణీతను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. ఆమె చొరవ, ధైర్యం నేటి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు ఎంతో స్ఫూర్తి అంటున్నారు.

Next Story