నీట్ క్రాక్ చేసిన రిటైర్డ్ టీచర్.. కానీ దక్కని ఎంబీబీఎస్ సీట్!

by Web Desk |
నీట్ క్రాక్ చేసిన రిటైర్డ్ టీచర్.. కానీ దక్కని ఎంబీబీఎస్ సీట్!
X

దిశ, ఫీచర్స్ : నేర్చుకునేందుకు వయసు అడ్డు కాదన్న విషయం మరోసారి రుజువైంది. తమిళనాడు, ధర్మపురికి చెందిన రిటైర్డ్ స్కూల్ టీచర్ కె. శివ ప్రకాశం నీట్-2021లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ మేరకు 249 మార్కులతో 349వ ర్యాంకు పొందాడు. అంతేకాదు ప్రభుత్వ కోటా కింద MBBS సీటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు కానీ సెలెక్ట్ కాలేకపోయాడు. ఎందుకంటే.. 61 ఏళ్ల శివప్రకాశం MBBS సీటు కోసం కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. కానీ పాఠశాల విద్యను 10+2 విధానంలో కొనసాగించనందున అతని దరఖాస్తు తిరస్కరించబడింది. దీనిపై సెలక్షన్ కమిటీ సెక్రటరీ డాక్టర్ పి. వసంత మణి వివరణ ఇచ్చారు. 'శివ ప్రకాశం ప్రీ యూనివర్సిటీ కోర్స్ (పీయూసీ) చేశారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ రద్దు చేయబడింది. మేము అతని పేరును ర్యాంక్ జాబితాలో చేర్చాం. కానీ ఉన్నతాధికారులు, న్యాయవాదుల నుంచి అభిప్రాయం కోరాము. అయితే 10+2 క్లియర్ చేసిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ కోటాలో సీటు కేటాయించాలని నిబంధనలు చెబుతున్నాయి' అని పేర్కొన్నారు.

శివ ప్రకాశం ఒక్కడే కాదు.. వయసుకు, చదువుకు సంబంధం లేదని నిరూపించిన వారిలో మన చుట్టూ చాలా మంది ఉన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌కు చెందిన 77 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి హుకుందాస్ వైష్ణవ్ 10వ తరగతి పరీక్షల్లో 55 సార్లు ఫెయిలైన తర్వాత ఉత్తీర్ణుడయ్యాడు. 2020లో ఒడిశాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ జే కిషోర్ ప్రధాన్ నీట్‌ను ఛేదించారు. అంతేకాదు మంచి ర్యాంక్ సాధించి VIMSARకు అర్హత సాధించాడు. తన చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేయాలని ఆయన పేర్కొన్నాడు. 2019లో కేరళకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ 4వ తరగతి పరీక్షలకు హాజరై, దేశంలోనే అతి పెద్ద విద్యార్థిగా నిలిచింది. ఆమె కొల్లంలోని స్టేట్ లిటరసీ మిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.


Next Story