సైబర్ సంరక్షకుడు.. బెంగళూరు బ్యాట్‌మ్యాన్.!

by Daayi Srishailam |

నెటిజన్లు ‘బెంగళూరు బాట్‌మ్యాన్’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

సైబర్ సంరక్షకుడు.. బెంగళూరు బ్యాట్‌మ్యాన్.!
X

దిశ, ఫీచర్స్: ఇంటర్నెట్ సమాచార విప్లవాన్ని తీసుకొచ్చినప్పటికీ సైబర్ నేరాలు, హింస, వేధింపుల వంటి సమస్యలను కూడా తెచ్చింది. అలాంటి ప్రమాదకరమైన డిజిటల్ లోకంలో ఒక సామాన్యుడు అసాధారణ రీతిలో పోరాడుతూ వేలాది మందికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతని పేరు దుష్యంత్ దూబే. నెటిజన్లు ‘బెంగళూరు బాట్‌మ్యాన్’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

ఒక ఫోన్ కాల్‌తో..

దుష్యంత్ దుబే ఒక సామాజిక కార్యకర్త. పదేళ్ల క్రితం ఒక ఆత్మహత్యను నిరోధించే ఫోన్ కాల్‌తో అతడి జర్నీ మొదలైంది. ఆ సంఘటన అతడి జీవిత లక్ష్యాన్ని మార్చేసింది. అప్పటి నుంచి డిజిటల్ వేధింపులు, గృహ హింస, సైబర్ నేరాలు, స్టాకింగ్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఆసరాగా నిలుస్తు్న్నాడు. బెంగళూరు నుంచి ప్రారంభించిన ఆ పని ఇప్పుడు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్నవారికి కూడా సహాయం అందిస్తున్నాడు దూబే.

మీమ్స్‌తో మిషన్

దుష్యంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘@st.broseph’ అనే హ్యాండిల్‌తో ఒక పేజీ నడుపుతాడు. ఈ పేజీలో మీమ్స్, పాప్ కల్చర్, హాస్యం కలగలిపిన పోస్టులు కనిపిస్తాయి. కానీ ఈ హాస్యం వెనుక ఒక గంభీరమైన లక్ష్యం ఉంది. సైబర్ నేరాలు, హింస వంటి అంశాలపై సమాచారాన్ని సరళంగా అందిస్తున్నాడు. తమ సమస్యలను ఎలా పరిష్కరించాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలబడుతున్నాడు. ఎఫ్‌ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి, ఎవరిని లీగల్‌గా బ్లాక్ చేయాలి, ఏ స్క్రీన్‌షాట్‌లను సేవ్ చేయాలి వంటివి వంటి వాటిలో అవగాహన కల్పిస్తున్నాడు.

ఫౌండేషన్ ఏర్పాటు..

సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేరాలను నమోదు చేయడానికి పోలీసుల నిర్లక్ష్యం, బాధితులపై నిందలు, చట్టపరమైన గందరగోళం వంటి అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడే దుష్యంత్ తన పాత్రను పోషిస్తాడు. బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చట్టపరమైన ఫిర్యాదులను రూపొందించడంలో సాయం చేస్తాడు. డిజిటల్ వేధింపులు, రివెంజ్ పోర్న్, స్టాకింగ్, గృహ హింస వంటి సమస్యలతో బాధపడేవారు అతడిని సంప్రదించడం మొదలుపెట్టారు. ఒక చిన్న అలలా మొదలైన ఈ సహాయం 2020 నాటికి ‘సిటిజన్స్ ఫర్ చేంజ్ ఫౌండేషన్’గా రూపాంతరం చెందింది.

సెయింట్ బ్రోసెఫ్‌గా..

దుష్యంత్ సహాయం బెంగళూరుకే పరిమితం కాలేదు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాడు. బాలల లైంగిక వేధింపులు, ఆర్థిక మోసాలు, కుల వివక్షతో కూడిన వేధింపులు, లింగ హింస వంటి సున్నితమైన సమస్యలను కూడా అతడు ధైర్యంగా ఎదుర్కొంటాడు. పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలు, సముదాయ సమూహాల కోసం డిజిటల్ సురక్ష, బైస్టాండర్ ఇంటర్వెన్షన్ వంటి అంశాలపై శిక్షణ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో సెయింట్ బ్రోసెఫ్‌గా ఎంతో పాపులారిటీ ఉంది. ఏళ్ల తరబడి చేసిన సేవలకు గుర్తింపు అది.

Next Story