చెరువుపై స్మార్ట్ ఫార్మింగ్.!

by Daayi Srishailam |

అతని కొత్త పద్ధతి రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రయోగశాలగా మారింది.

చెరువుపై స్మార్ట్ ఫార్మింగ్.!
X

దిశ, ఫీచర్స్: ఒడిశాకు చెందిన 32 ఏళ్ల రైతు హిరోద్ పటేల్ చెరువులపై "ట్రెల్లిస్ వ్యవస్థ"ను ఏర్పాటు చేసి కూరగాయలతో పాటు చేపలను పెంచుతూ వినూత్న వ్యవసాయం చేస్తున్నాడు. అతని కొత్త పద్ధతి రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రయోగశాలగా మారింది.

చెరువై కూరగాయలు

హిరోద్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. తండ్రి శివ శంకర్‌తో కలిసి 8 సంవత్సరాల క్రితం సాంప్రదాయ వరి సాగు ప్రారంభించాడు. రాత్రింబవళ్లు కష్టపడినప్పటికీ తక్కువ ఆదాయం వచ్చేది. ఈ పరిస్థితిని మార్చేందుకు హిరోద్ ఒక వినూత్న విధానాన్ని అవలంబించాడు. 2019లో "వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్", "సాయిల్ కన్సర్వేషన్ యూనిట్" సహాయంతో 10 ఎకరాల భూమిలో నాలుగు చెరువులను తవ్వించాడు. వీటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి మొదట చెరువు చుట్టూ అరటి, జామ, కొబ్బరి చెట్లను నాటాడు. చెరువుపైన "ట్రెల్లిస్ వ్యవస్థ"ను ఏర్పాటుచేసి తీగజాతి వెజిటేబుల్స్ పండించాడు.

ట్రెల్లిస్ వ్యవస్థ

ట్రెల్లిస్ వ్యవస్థ అనేది మొక్కలను నేల నుంచి ఎత్తయిన బాంబూ లేదా కర్రల మద్దతుతో పెంచే పద్ధతి. ఇది మొక్కలకు సూర్యరశ్మిని అందించడాన్ని సులభతరం చేస్తుంది. ద్రాక్షతోటలలో ఇలాంటి విధానాన్ని ఎక్కువగా వాడతారు. హిరోద్ దీనిని చెరువుపైన అమలు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఆచరించాడు. దీనివల్ల కూరగాయలకు నీరు పోసే అవసరంన్ని తగ్గింది. ట్రెల్లిస్ విధానంలో మొదట 120 బీర మొక్కలను నాటగా గత సెప్టెంబర్‌లో 1800 బీరకాయలు చేతికొచ్చాయి. దీనివల్ల తనకొచ్చే పంట ఆదాయానికి అదనంగా రూ.35000 వచ్చింది.

రైతు ప్రయోగశాల

హిరోద్ చెరువులలో పిస్కికల్చర్ కూడా చేస్తున్నాడు. దీనివల్ల ఆదాయం మరింత పెరిగింది. తన వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి కూరగాయలు కోయడానికి ఒక చిన్న పడవను నిర్మించాడు. ఈ వినూత్న విధానం ఒడిశా ఇతర ప్రాంతాల నుంచి రైతులను ఆకర్షిస్తోంది. దీంతో అతని వ్యవసాయ క్షేత్రం ఇప్పుడొక ప్రయోగశాలగా మారింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనలను ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఈ ట్రెల్లిస్ వ్యవస్థ, సమగ్ర వ్యవసాయం సాంప్రదాయ రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గాన్ని చూపించాయి.

Next Story