ప్రాణాంతకంగా మారుతున్న ఫుడ్ పాయిజనింగ్.. రిస్క్ నుంచి బయటపడే మార్గమిదే.. !

by Dishafeatures2 |
ప్రాణాంతకంగా మారుతున్న ఫుడ్ పాయిజనింగ్.. రిస్క్ నుంచి బయటపడే మార్గమిదే.. !
X

దిశ, ఫీచర్స్ : ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, అవి విషంగా మారితే అంతకంటే ఎక్కువగా ప్రాణహాని కలిగిస్తాయి. ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ అనేది ప్రపంచ వ్యాప్త సమస్యగా మారుతోంది. వివిధ వ్యాధులకు కారణం అవుతోంది. అందుకే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనల్ని చంపేసే భయంకర శత్రువుగా వర్ణిస్తుంటారు. ప్రమాదకరమైనదే అయినప్పటికీ నివారించగలితే దానివల్ల తలెత్తే ప్రమాదాల నుంచి, ప్రాణహాని నుంచి బయట పడవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

ఫుడ్ ప్రిపేర్ చేసేముందు

ఫుడ్ పాయిజన్ కలగడానికి అనేక కారణాలలో చేతులు శుభ్రంగా లేకపోవడం కూడా ఒకటి. వివిధ సందర్భాల్లో ఏం అవుతుంది లే అనుకొని చేతులు కడగకుండా ఆహార పదార్థాలను తింటే కూడా కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కావచ్చు. అలాగే ఆహారాన్ని ప్రిపేర్ చేసే ముందు పచ్చి మాంసం, గుడ్లు మొదలైన వాటిని తాకిన తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి. అంతేకాకుండా ఫుడ్ ప్రిపేర్ చేసేముందు ముందు, ఆ తర్వాత కూడా పరిశుభ్రత పాటించాలి. క్రమం తప్పకుండా చేతి, డిష్ తువ్వాళ్లను కడగడం కడగడం చాలా ముఖ్యం. ఇవి ఎక్కవసేపు తడిగా ఉండే తేమ పరిస్థితులవల్ల బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది.

పచ్చి మాంసం వినియోగించడం

పచ్చి మాంసం, చేపలు వంటకు ప్రిపేర్ చేసే క్రమంలో వాటికోసం ప్రత్యేక కట్టింగ్ బోర్డ్‌ను ఉపయోగించడం మంచిది. అలాగే పచ్చి మాంసాన్ని ఇంట్లోకి తెచ్చినప్పుడు ఇతర కూరగాయలు, పదార్థాలకు దగ్గరగా కాకుండా వేరుగా ఉంచాలి. ముఖ్యంగా వండటానికి వీల్లేని ఆహారాలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే పచ్చిమాంసం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చు. వండకపోతే ఈ బ్యాక్టీరియా చనిపోదు. అలాగే రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసేటప్పుడు దిగున ఉండే షెల్ఫ్‌లో ఉంచడం బెటర్. దీనివల్ల ఆ మాంసం నుంచి వెలువడే లిక్విడ్, నీరు వంటివి ఇతర ఆహారంపై పడకుండా ఉంటాయి. అలాగే వండినప్పుడు మాంసం పూర్తిగా ఉడికిందో లేదో నిర్ధారించుకోండి. ఒకసారి వండిన తర్వాత లోపల పింక్ కలర్ ఉండదని గమనించండి. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాలను తగ్గించడానికి ఇది చాలా అవసరం.

సరైన టెంపరేచర్‌లో ఉంచండి

ఆహారాన్ని వండిన తర్వాత, కొన్ని రకాల పదార్థాలు వండకపోయినప్పటికీ వాటిని నిల్వచేసే వాతావరణం సరైనదిగా లేకపోతే ఫుడ్ పాయిజన్‌కు దారితీస్తుంది. అందుకే మీ రిఫ్రిజిరేటర్‌ను 5ºC (41ºF) కంటే తక్కువ టెంపరేచర్ వద్ద ఉండేలా సెట్ చేసుకోవాలి. అలాగే రిఫ్రిజిరేటర్‌ను ఓవర్‌లోడ్ చేయకుండా ప్రయత్నించండి. ఎందుకంటే ఇది గాలి ప్రవాహం లేకపోవడం వల్ల మొత్తం ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది.

మిగిలిపోయిన పదార్థాలు తినవద్దు

చాలా మంది వంటలు చేసినప్పుడు, బయటి నుంచి తెచ్చుకున్నప్పుడు మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు లేదా తమకు ఇష్టమైనప్పుడు తింటుంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజన్ తలెత్తే అవకాశం ఎక్కువ. చాలా వరకు పదార్థాలు 90 నిమిషాల వరకే ఫ్రెష్‌గా ఉంటాయి. మరికొన్ని మిగిలిపోయిన 48 గంటల తర్వాత పాడవుతాయి. అందుకే ఆ సమయం మించిన తర్వాత తినకూడదు. ఇక ‘యూజ్ బై డేట్స్’ను అస్సలు విస్మరించవద్దు. గడువు తేదీ తర్వాత ఆహారం సరిగ్గానే ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ తేదీలు ఒక కారణంతో ఉన్నాయి. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి రిస్క్ తీసుకోకండి.

అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా చేయకండి

మీరు అనారోగ్యంతో ఉంటే ఇతరులకు ఆహారాన్ని సిద్ధం చేయవద్దు. మీ చేతులు శుభ్రంగా ఉన్నప్పటికీ, మీరు ఇతర వ్యక్తుల కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు దగ్గడం, తుమ్మడం వంటి కారణాలతో రోగకారకాలు ఆహారా పదార్థాలపై ప్రభావం చూపుతాయి. మీలాగే అవి తిన్నవారు కూడా అనారోగ్యానికి గురయ్యే చాన్స్ ఉంటుంది.

చికెన్ కడగవద్దు

చాలా మంది చికెన్, ఇతర మాంసాన్ని కడగడం మంచిదని అనుకుంటారు. కానీ కరెక్ట్ కాదు! కడగడంవల్ల దానిపై ఉండే బ్యాక్టీరియాలు పోవు. పైగా కడిగేటప్పుడు సింక్ వద్ద అవి వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే కడగకుండా వండుకోవాలి. అయితే పండ్లు, కూరగాయలను మాత్రం తప్పకుండా కడిగిన తర్వాతనే ఉపయోగించాలి. ఎందుకంటే ఇవి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. పెప్టిసైడ్ జాడలు కూడా ఉండవచ్చు. కాబట్టి వాటిని పూర్తిగా కడగడం చాలా అవసరం.

బాగుందో లేదో అని టేస్ట్ చూడకండి

కొన్సిసార్లు ఆహార పదార్థాలు బాగున్నాయో, పాచిపోయాయో తెలుసుకోవడానికి వాటిని రుచి చూస్తుంటాం. కానీ ఇది ప్రమాదకరం. చాలా వరకు చెడిపోయి ఉండవచ్చు అనే అనుమానంతోనే అలా చేస్తుంటాం. అంటే ఆ పదార్థం గడువు ముగిసింది కాబట్టే కదా ఈ డౌట్ వచ్చేది. అలాంటప్పుడు మళ్లీ టేస్ట్ చేయడం దేనికి? ఇలా చేయడం వల్ల అది స్మాల్ క్వాంటిటీనే కావచ్చు కానీ మిమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేయవచ్చు. ఫుడ్ పాయిజన్‌కు దారితీయవచ్చు. కాబట్టి ఆ అవకాశం తీసుకోవద్దు!

ఇవి ఎక్కువ ప్రమాదకరం

ఫుడ్ పాయిజనింగ్ వివిధ రకాల ఆహారాల నుంచి రావచ్చు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలవల్ల ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది. పౌల్ట్రీ ఉత్పత్తుల్లో సాల్మొనెల్లాను బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. అయితే ఇది వండటం ద్వారా చంపబడుతుంది. అలాగే సరైన ఉష్ణోగ్రతవద్ద స్టోర్ చేయకపోతే, ఫిష్ అండ్ షెల్ఫిష్‌(shellfish) కూడా ప్రమాదకరం. అలాగే బియ్యం ఎక్కువకాలం స్టోర్ చేయడంవల్ల సిల్లస్ సెరియస్‌ బ్యాక్టీరియాకు గురవుతాయి. వండిన తర్వాత కూడా ఇది చావదు. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే ప్యాక్ చేసిన మాంసాలు(Deli meats), పచ్చి గుడ్లు, పచ్చి పాలు కూడా ఆరోగ్యానికి హానికరం. పచ్చి మొలకలు, వండకుండా తినే రెడ్ కిడ్నీ బీన్స్ కూడా ఫుడ్ పాయిజన్ కలిగిస్తాయి.


Next Story