ఐదు నిమిషాల్లో మట్టి పరీక్ష.!

by Daayi Srishailam |   (  Updated:2025-07-16 15:30:00  IST  )

సమస్య పరిష్కారం కోసం ఒక చిన్న పరికరాన్ని కనిపెట్టారు.

ఐదు నిమిషాల్లో మట్టి పరీక్ష.!
X

దిశ, ఫీచర్స్: సాంప్రదాయ పద్ధతుల్లో మట్టి పరీక్షలు చేయడం నెమ్మది ప్రక్రియ. ఇంకా అసౌకర్యం.. ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అర కిలో మట్టిని సేకరించి ప్రయోగశాలకు పంపి 10-15 రోజులు ఫలితాల కోసం ఎదురుచూడాలి. ఈ లోపు విత్తనాలు నాటి, ఎరువులు చల్లేస్తారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఒక చిన్న పరికరాన్ని కనిపెట్టారు.

సారం కోల్పోయిన భూమికి..

రైతులు తరతరాలుగా సాంప్రదాయ జ్ఞానం, దృశ్య సూచనల ఆధారంగా భూమిని సంరక్షించుకుంటూ వచ్చారు. దశాబ్దాలపాటు రసాయన ఎరువుల అతి వినియోగం వల్ల మట్టి సారం కోల్పోయింది. ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. ఒక హెక్టార్ భూమిలో రెండు టన్నుల పంట దిగుబడి కోసం కేవలం 54 కిలోల ఎరువు సరిపోయేది. ఇప్పుడు అదే దిగుబడి కోసం 280 కిలోలకు పైగా ఎరువు అవసరమవుతోంది. భూమికి నిజంగా ఏమివ్వాలో, ఏం అవసరముందో రైతులు తెలుసుకోలేకపోతున్నారు. డాక్టర్ రాజుల్ పట్కర్ దీనికొక చక్కటి పరిష్కారం చూపించారు.

ప్రయోగశాల ఎందుకు.?

డాక్టర్ రాజుల్ పట్కర్ ప్రాక్సిమల్ సాయిల్‌సెన్స్ టెక్నాలజీస్ కో ఫౌండర్. "న్యూట్రిసెన్స్"అనే పరికరాన్ని కనిపెట్టారు. ప్రపంచంలోనే అతి చిన్న మట్టి పరీక్షా పరికరం ఇది. కేవలం ఐదు నిమిషాల్లో ఖచ్చితమైన, ప్రయోగశాల స్థాయి ఫలితాలను అందిస్తుంది న్యూట్రిసెన్స్. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. రైతులు ఇక ఊహాగానాలు, ఆలస్యం చేయడం, ప్రయోగశాలలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు డాక్టర్ రాజుల్ పట్కర్. రైతులకు స్పష్టత, నియంత్రణ, ఆత్మవిశ్వాసం అందించడానికి ఈ పరికరం పనిచేస్తోంది.

మట్టి ఆరోగ్య పునరుద్ధరణ..

న్యూట్రిసెన్స్ ఒక సంవత్సరంలో 3,000 పరీక్షలు చేస్తుంది. దీన్ని దాదాపు మూడు సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాక, ప్రకృతి, వ్యవసాయం మధ్య సమతుల్యతను పునరుద్ధరించడంలో ఇది సహాయపడుతోంది. మట్టికి ఏమి అవసరం, ఏమి అనవసరం అనేది స్పష్టంగా చూపించి వృథాను తగ్గిస్తుంది. పంట దిగుబడిని పెంచుతుంది. కాలక్రమేణా మట్టి ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది. డాక్టర్ పట్కర్ దీనిని “సాంకేతిక విప్లవం”గా అభివర్ణిస్తారు.

ఎలా పరీక్షించాలి?

దశ 1: మట్టి నమూనా సేకరించండి

పంట పండించాలనుకునే భూమిలో ఒక గ్రాము మట్టిని సేకరించండి. రాళ్లు, ఆకులు, ఇతర చెత్త లేకుండా శుభ్రమైన నమూనా తీసుకోవాలి.

దశ 2: ద్రావణం సిద్ధం చేయండి

న్యూట్రిసెన్స్ కిట్‌లో ఉన్న ఒక చిన్న గాజు సీసాలో మట్టి నమూనాను ఉంచండి. అందులో మూడు మిల్లీలీటర్ల రసాయన ద్రావణం కలిపి, సున్నితంగా షేక్ చేయండి. సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచితే, మట్టి దిగువన స్థిరపడి, పైన స్పష్టమైన ద్రవం ఏర్పడుతుంది.

దశ 3: సెన్సార్‌పై ఒక చుక్క వేయండి

డ్రాపర్‌ని ఉపయోగించి స్పష్టమైన ద్రవం ఒక చుక్కను పరికరంతో అనుసంధానించబడిన కాగితం ఆధారిత సెన్సార్ స్ట్రిప్‌పై వేయండి. ఈ స్ట్రిప్‌లు మట్టిలోని వివిధ పోషకాలు, లక్షణాలను గుర్తిస్తాయి. ఒక చుక్క వేసిన వెంటనే న్యూట్రిసెన్స్ విశ్లేషణ ప్రారంభిస్తుంది. ఇది pH, విద్యుత్ వాహకత, నైట్రేట్, ఫాస్ఫేట్, పొటాషియం, అమ్మోనియాకల్ నైట్రోజన్ వంటి ఆరు కీలక పరామితులను పరీక్షిస్తుంది.

దశ 4: ఫలితాలను చూడండి

ప్రతి పరామితి విశ్లేషణకు 25-30 సెకన్లు పడుతుంది. ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో కేబుల్స్ లేదా కంప్యూటర్ల అవసరం లేకుండా మట్టిలోని పోషక స్థాయిల పూర్తి వివరణ మీ చేతిలో ఉంటుంది. ఫలితాలు మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయగల మట్టి ఆరోగ్య కార్డు రూపంలో వస్తాయి.

దశ 5: డేటా ఆధారంగా చర్యలు తీసుకోండి

మట్టి ఆరోగ్య కార్డు సహాయంతో భూమికి ఎంత ఎరువు, ఏ రకం, ఎప్పుడు వేయాలో ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. శాస్త్రీయ ఆధారాలతో ఎరువులు వాడటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ఖర్చు కూడా తక్కువ అవుతుంది.

Next Story