జీవనోపాధి కోసం టెంపో నడిపిన వ్యక్తి ఇప్పుడు ఎయిర్ లైన్స్ ఓనర్

by Daayi Srishailam |

టెంపో టు టెక్.. శంఖ్ ఎయిర్ శ్రవణ్

జీవనోపాధి కోసం టెంపో నడిపిన వ్యక్తి ఇప్పుడు ఎయిర్ లైన్స్ ఓనర్
X

దిశ, ఫీచర్స్: దేశమంతటా ఇప్పుడు శంఖ్ ఎయిర్ గురించే చర్చ జరుగుతోంది. సెంట్రల్ మినిష్టర్ కింజరావు రామ్మోహన్ నాయుడు గ్రీన్ సిగ్నల్‌తో విను వీధుల్లోకి మూడు కొత్త విమాన సంస్థలు వస్తున్నాయి. వీటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది శంఖ్ ఎయిర్. యూపీ నుంచి వస్తున్న ఫస్ట్ ఎయిర్‌లైన్ ఇదే. దీని ఫౌండర్ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ఒకప్పుడు టెంపో డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు.

టెంపో డ్రైవర్‌‌‌‌‌‌గా..

శ్రవణ్ కుమార్ విశ్వకర్మ జీవితం అట్టడుగు స్థాయి నుంచి మొదలైంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పేద కుటుంబంలో పుట్టిన శ్రవణ్.. ఇప్పుడు శంఖ్ ఎయిర్ చైర్మన్. నూతన సంవత్సరం సందర్భంగా 2026లో ప్రారంభమయ్యే ఈ ఎయిర్‌లైన్‌తో ఆయన ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. కుటుంబ పరిస్థితుల వల్ల స్కూల్ మానేశాడు శ్రవణ్. జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేసేవాడు. టెంపో నడుపుతూ నగర వీధుల్లో రోజూ సరుకులు రవాణా చేస్తూ జీవితం గడిపాడు. ఒకవైపు పని చేస్తూనే జీవితాన్ని ఇక్కడితోనే ఆగిపోనీయొద్దు అనుకునేవాడు. కష్టపడి పనిచేస్తూ వ్యాపారవేత్తగా నిలదొక్కుకోవాలని కలగనేవాడు.

ఎనిమిది కంపెనీలలో..

స్నేహితులతో కలిసి చిన్న వ్యాపారాలు ప్రయత్నించాడు. కానీ అవి సక్సెస్ కాలేదు. 2014లో సిమెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం తనకొక మలుపులాంటిది. టీఎంటీ స్టీల్ బార్ల వ్యాపారంలో విజయం సాధించి లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్.. స్టీల్ ట్రేడింగ్.. రవాణా.. మైనింగ్ రంగాల్లోకి విస్తరించాడు. 2022లో శంఖ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాడు. ఇది సిరామిక్స్.. కాంక్రీట్ ఉత్పత్తులు.. హోల్‌సేల్ ట్రేడింగ్‌లో వృద్ధి చెందుతోంది. పెద్ద ట్రక్ ఫ్లీట్ నిర్మించి ఎనిమిది కంపెనీలలో డైరెక్టర్‌గా మారాడు. ఈ వ్యాపారాలు ఆయన కలగన్న పెద్ద కలకు ఆర్థిక బలాన్నిచ్చాయి.

శంఖ్ ఏవియేషన్..

శ్రవణ్‌కు ఎయిర్‌లైన్ స్థాపించాలనే ఆలోచన వచ్చింది. తనలాంటి సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాడు. అలా 2023లో శంఖ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించాడు. 2025 డిసెంబర్‌లో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాడు. శంఖ్ ఎయిర్ ఉత్తర్ ప్రదేశ్‌లో మొదటి స్వదేశీ ఎయిర్‌లైన్‌గా లాంచ్ కాబోతుంది. 2026 జనవరి-ఫిబ్రవరిలో మూడు ఎయిర్‌బస్ విమానాలతో స్టార్ట్ అవుతుంది. లక్నోను ఢిల్లీ.. ముంబైలాంటి పెద్ద నగరాలతో అనుసంధానం చేస్తుంది. తర్వాత వారణాసి.. గోరఖ్‌పూర్‌లాంటి రూట్లకు విస్తరిస్తుంది.

Next Story