అవినీతిరహిత సమాజాన్ని నిర్మిద్దాం : బీడీఎల్

by  |
BDL CVO
X

దిశ, పటాన్ చెరు: సమాజంలో లంచం అనే మాటకు తావు లేకుండా మనమందరం నడుచుకోవాలని బీడీఎల్ సీవీఓ డాక్టర్ ఉపేందర్ వర్ణం అన్నారు. గురువారం పటాన్ చెరు మండలం భానూర్ గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఆధ్వర్యంలో విజిలెన్స్ నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతి, లంచగొండితనం పైన భారత్ డైనమిక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 26 నుండి నవంబర్ 1వ తారీకు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.

భానూర్ గ్రామాన్ని బీడీఎల్ దత్తత తీసుకుందని గుర్తు చేశారు. గ్రామాభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. డబ్బులు ఇచ్చినా, తీసుకున్న నేరమునని ఆయన అన్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలందరూ చట్టాలను గౌరవిస్తూ నడుచుకోవాలని కోరారు. మనమందరం బాధ్యతగా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీడీఎల్ పరిశ్రమ ప్రతినిధులు రమేష్ బాబు, కిషన్, సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్, బీడీఎల్ యూనియన్ జనరల్ సెక్రెటరీ యాదగిరి, ఎంపీటీసీ యాదగిరి, ఈఓ సంగీత తదితరులు పాల్గొన్నారు.

Next Story