మంగళ్​హాట్ లో కారుకు బ్రేకేనా?

by  |
మంగళ్​హాట్ లో కారుకు బ్రేకేనా?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం మంగళ్ హాట్ డివిజన్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎదురీదుతోంది. ఐదేండ్ల పాటు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో డివిజన్ ఉందని స్థానికులు మండిపడుతున్నారు. తాజా మాజీ కార్పొరేటర్ ను తానే గెలిపించానని బహిరంగంగా ప్రకటన చేసిన పార్టీ నాయకుడు నంద కిషోర్ వ్యాస్ కార్పొరేటర్ ను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. కార్పొరేటర్ కు నెలసరి వేతనం ఇస్తూ సదరు నాయకుడే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడనేది అంత‌టా చ‌ర్చనీయాంశ‌మైంది. మంగళ్ హాట్ డివిజన్ లో పార్టీ ముందువెనుకా చూడకుండా సిట్టింగ్​కే టికెట్ కేటాయించడంతో పాటు ఇద్దరు పరిశీలకులను నియమించింది. వీరికి డివిజన్ సమస్యలపై అవగాహన లేకపోవడం, పార్టీ అనుచరులు, నాయకులకు తెలియకుండా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి.

ఇప్పటి వరకు చేసిందేమిటీ..

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మంగళ్ హాట్ డివిజన్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను పార్టీ ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. వీరే కాకుండా మరో జెడ్పీటీసీ కూడా ఉన్నారు. మంగళ్ హాట్ డివిజన్ నుంచి ఐదేళ్ల పాటు పార్టీ కార్పొరేటరే ఉన్నప్పటీకీ అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ముందు నుంచి పురానాఫూల్ వైపు వెళ్లే రోడ్డులో డ్రైనేజీ పొంగుతున్నా ఏనాడు పట్టించుకోలేదని స్థానికులు మండి పడుతున్నారు. దూల్ పేటలో గుడుంబా మానేసిన వారికి పున‌రావాసం క‌ల్పిస్తామ‌ని, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టిస్తామ‌ని, యువ‌తకు ఉపాధి కల్పించేందుకు స్థానికంగా ప‌రిశ్రమ‌లు ఏర్పాటు చేస్తామ‌ని గ‌తంలో ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇవే కాకుండా డివిజ‌న్ లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ప‌రిశీల‌కులు పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి డివిజ‌న్ ను ద‌త్తత తీసుకుంటాన‌ని చెప్పిన‌ప్పటికీ ప్రజ‌లు విశ్వసించ‌డం లేదు. దీంతో డివిజ‌న్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ప‌ర‌మేశ్వరి సింగ్ ఓట‌మి ఖాయ‌మ‌నే అభిప్రాయాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed