మాటేసి వేటాడుతున్న చిరుతలు.. ఎటు చూసినా జంతువుల కళేబరాలే..!

by  |
మాటేసి వేటాడుతున్న చిరుతలు.. ఎటు చూసినా జంతువుల కళేబరాలే..!
X

దిశ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చిరుత పులుల సంచారం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అడవిలో తినేందుకు ఏమీ దొరకకపోవడంతో ఊళ్ల మీద పడి పశు సంపదను వేటాడుతున్నాయి. గత 15 రోజుల కిందట మోపాల్ మండలం మంచిప్పా గ్రామ పరిధిలో గల తండాలోని పశువులపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. అదేవిధంగా గత వారం కిందట డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో గొర్రెల మంద మీద దాడి చేసింది. ఈ ఘటన మరువక ముందే ఇందల్వాయి మండలంలోని మెగ్యనాయక్ తండాలో ఆవులమంద పై అకస్మాత్తుగా దాడి చేసి ఆవును చంపి తినేసింది. భయాందోళనకు గురైన పశువుల కాపరి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు.

దీంతో అటవీ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మృతి చెందిన ఆవును పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారిని పిలిపించి ఆవును చంపింది పులా? కాదా? పరీక్షించారు. పశు వైద్యాధికారి గంగా ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చిరుత పులి దాడిలోనే ఆవు చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అసలే అటవీ ప్రాంతానికి దగ్గరగా ఊరు ఉండటంతో రాత్రి వేళలో ఎక్కడ చిరుత గ్రామంలోని పశువులపైనే కాకుండా మనుషుల పై కూడా దాడికి పాల్పడుతుందేమోనని భయంతో వణికిపోతున్నారు.ఇదిలా ఉండగా బుధవారం రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో రెండు చిరుతలు కలకలం సృష్టించాయి. సాయంత్రం గ్రామ శివారులో ఉన్న పంటపొలాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న రైతులు అక్కడే ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో రెండు పెద్ద బండ రాళ్ల మీద రెండు చిరుతలు కూర్చుని ఉండటాన్ని వారు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు, అధికారులకు తెలియజేశారు. కాగా కొందరు చిరుతల ఫోటోలను కూడా తీశారు. గత మంగళవారం చిరుత పులి ఆవును చంపి తిన్నదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. మళ్లీ ఇప్పుడు చిరుత పులులు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా మల్లారం ఫారెస్ట్ రేంజ్‌లో చిరుతలు సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

అటవీ అధికారుల పర్యవేక్షణ అవసరం..

ప్రస్తుతం చిరుత పులి అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరిస్తున్నది. దీనిని బట్టి అటవీ శాఖ అధికారులు సైతం ఆయా గ్రామాల్లోని అటవీ క్షేత్రాల్లో పులి బోను, సీసీ కెమెరాలను అమర్చి చిరుతపులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. లేనియెడల గ్రామంలో ఉన్న ప్రజలపై కూడా చిరుత దాడి చేసే అవకాశం లేకపోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉండగా డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో గత వారం కిందట చిరుతపులి కొండ మీదకి ఎక్కి అరిచిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుత పులిని పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.


Next Story