మాధవన్‌ వాయిస్ నాదే : హేమచంద్ర

by  |
మాధవన్‌ వాయిస్ నాదే : హేమచంద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ సినిమా హిట్ అయితే, అందులో మేజర్ క్రెడిట్ దక్కేది హీరోతో పాటు దర్శక, నిర్మాతలకే అన్న విషయం తెలిసిందే. కానీ ఆ విజయం వెనక ఎంతో మంది శ్రమ దాగుంటుందనేది కాదనలేని నిజం. కానీ వారికి సరైన గుర్తింపు లభించదు. అలాంటి కేటగిరీల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డబ్బింగ్. ఎంతోమంది డబ్బింగ్ ఆర్టిస్టులు తమ టాలెంట్‌తో తెరపై పాత్రలకు ప్రాణం పోస్తుంటారు. అయితే ‘నిశ్శబ్దం’ సినిమాతో తాజాగా సక్సెస్ అందుకున్న మాధవన్‌ ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు తనే సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రస్తావించింది. కాగా ఈ విషయంపై స్పందించారు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమచంద్ర. ‘సవ్యసాచి’లో మాధవన్ పాత్రకు తనే డబ్బింగ్ చెప్పానని, కానీ పత్రికలో ఇలా రాయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

హేమచంద్ర సింగర్‌గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. బిచ్చగాడు ఫేమ్ ‘విజయ్ ఆంటోనికి తెలుగు డబ్బింగ్ సినిమాలన్నింటికీ తనే డబ్బింగ్ అందిస్తాడు. ‘ధృవ’ సినిమాలో అరవింద్ స్వామి పాత్రతో పాటు ‘కవచం’లో నీల్ నితిన్ ముఖేష్, గద్దలకొండ గణేష్ మూవీలో అథర్వకు, ‘అశ్వద్ధామ, భీష్మ’లోని జిషు సెంగుప్తల పాత్రలకు కూడా హేమచంద్ర తన గొంతు అరువిచ్చాడు. కాగా లేటెస్ట్‌గా ‘సవ్యసాచి’ సినిమా విషయంలో పత్రికలో వచ్చిన తప్పుడు వార్తపై హేమచంద్రతో పాటు అతడి అభిమానులు, అతడి భార్య శ్రావణ భార్గవి కూడా విమర్శించారు. ఓ విషయం ప్రచురించేటప్పుడు.. దానిపై కనీస అవగాహన ఉండాలని, ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుని ప్రచురించాలని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ వార్తను సరిచేయాల్సిందిగా డైరెక్ట్‌గా ఆ పత్రికకే పోస్ట్ పెట్టాడు హేమచంద్ర. ప్రస్తుతం ఆ తప్పుడు సమాచారపు పేపర్ కటింగ్ ఇమేజ్.. నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇక ఇటీవలే మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో మాధవన్ పాత్రకు చెప్పిన డబ్బింగ్‌కు ప్రశంసలు కూడా దక్కాయి. అయితే.. దానికి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అజీజ్ నజీర్ తన వాయిస్‌ను అందించాడు.

Next Story

Most Viewed