స్వదేశీ బ్రాండ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. చైనాకు పోటీ..

by  |
స్వదేశీ బ్రాండ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. చైనాకు పోటీ..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మొబైల్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ తన మొదటి స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. దీనిద్వారా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ బ్రాండ్‌గా లావా నిలిచింది. ‘అగ్ని’ పేరుతో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ను లావా కంపెనీ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంట్‌లో తయారుచేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో చైనా బ్రాండ్‌లకు పోటీగా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.19,999గా నిర్ణయించారు. ‘దేశీయ బ్రాండ్ వినియోగదారులకు అగ్ని మెరుగైన ఎంపిక అవుతుందని’ లావా ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది.

మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన రెండో కంపెనీగా తాము నిలిచామని లావా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, బిజినెస్ హెడ్ సునీల్ రైనా అన్నారు. ఇదే చిప్‌సెట్‌తో ఉన్న చైనా కంపెనీల మొబైల్స్ కంటే అధిక కెమెరా ఫీచర్లను లావా అందిస్తోంది. ఇది 6.78 అంగుళాల హై-డెఫినిషన్ డిస్‌ప్లేతో మార్కెట్లో విడుదలైంది. ఈ విభాగంలో అతిపెద్ద డిస్‌ప్లేతో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ‘ప్రస్తుతం అగ్ని స్మార్ట్‌ఫోన్ ఇతర చైనా బ్రాండ్‌ల కంటే మెరుగైన ఫీచర్లతో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరీజీతో వస్తోంది.

ప్రీ-బుకింగ్ చేసుకునే వారికి ప్రస్తుతం రూ. 17,999కే అందిస్తున్నాం’ అని సునీల్ రైనా తెలిపారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 30 వాట్ల సూపర్‌ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ మొబైల్ వస్తోంది. 90 నిమిషాల్లోపే 100 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. నవంబర్ 18 నుంచి ఈ దేశీయ 5జీ స్మార్ట్‌ఫోన్ రిటైల్ మార్కెట్లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుంది. మంగళవారం(నవంబర్ 9) నుంచి 17 వరకు లావా ఈ-స్టోర్‌తో పాటు అమెజాన్‌లో రూ. 500తో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.



Next Story

Most Viewed