YS షర్మిల కోర్టు ఆదేశాలు బ్రేక్ చేశారు!

by Disha Web Desk 2 |
YS షర్మిల కోర్టు ఆదేశాలు బ్రేక్ చేశారు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాదయాత్ర, సభకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును షర్మిల కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా షర్మిల కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను షర్మిల పాటించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యల వీడియోలను న్యాయమూర్తికి జీపీ చూపించారు.

దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబోనంటూ అఫిడవిట్ ఇవ్వాలని షర్మిలకు కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను మార్చి3కు వాయిదా వేసింది. కాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆమెపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని తన నివాసంలో వదిలిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించారు.

గతంలోనూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్షియల్ కావడంతో షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి క్యాన్సిల్ చేశారు. ఆ సందర్భంలో హైకోర్టు నుంచి షరతులతో కూడిన అనుమతి తీసుకుని షర్మిల తన పాదయాత్ర కొనసాగించారు. ఈసారి కూడా షర్మిల వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ రద్దు చేశారు.

Next Story

Most Viewed