కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో మేడం మాట వినాల్సిందే!

by  |
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో మేడం మాట వినాల్సిందే!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలోని రెండు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉండే కరీంనగర్ సర్కారు ఆస్పత్రిలో ఒకరిద్దరు బాసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారి వల్ల సిబ్బందికి తీరని నష్టం వాటిల్లుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 15 రోజుల కిందట కొవిడ్ లక్షణాలతో ఓ పెద్దావిడ సివిల్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు చికిత్స అందించేందుకు ట్రామా డిపార్ట్‌మెంట్‌లోని ఐసీయూలోకి తరలించారు. అక్కడ వైద్య సేవలందించే సిబ్బంది నిరాకరించినా ఆ పెద్దాఫీసర్ గుర్రుమనడంతో కిమ్మనలేకపోయారు. ట్రామా యూనిట్‌లో చికిత్స పొందిన ఈ పెద్దావిడ మరణించింది. ఆ తర్వాత ఆమెకు టెస్టు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటకే ఆమె నుంచి పలువురు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి, వారి నుంచి కుటుంబీకులకు కరోనా సోకడం చకచకా జరిగిపోయాయి. దాంతో 15 మంది బాధితులుగా మారిపోయారు. ఇందులో 9 నెలల పసికందు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.

ప్రత్యేక వార్డులున్నా..

ఆస్పత్రి పెద్దలు కరోనా పేషెంట్లకు వైద్య సేవలందించేదుకు సివిల్ ఆస్పత్రిలో స్పెషల్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఐసీయూ, ఏఎంసీ, ఐసొలేషన్ వార్డులను ప్రత్యే కంగా ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారి స్టేజీని బట్టి ఈ వార్డుల్లోనే జాయిన్ చేయాలి. కానీ, అలాకాకుండా ఓ డిపార్ట్‌ మెంట్ హెడ్ చెప్పినట్లు సాధారణ రోగులకు చికిత్స అందించాల్సిన వార్డుల్లో జాయిన్ చేశారు. దాంతో ఇంతమందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అనుమానిత కేసులను కామన్ ట్రీట్ మెంట్ ఇచ్చే వార్డుల్లోనే ఉంచా లని ‘పెద్దల’ నుంచి ఫోన్ వచ్చిందన్న సాకుతో అక్కడే జాయిన్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దాంతో కరీంనగర్ సివిల్ ఆస్పత్రి కేంద్రంగానే కరోనా విస్తరిస్తోందన్న భయం మొదలైంది. పలుకుబడి గల సార్లు ఫోన్లు చేస్తే చాలు వారు కొవిడ్ డిపార్ట్‌మెంట్ నుంచి ట్రామా‌యూనిట్‌లోకి వచ్చి చేరుతున్నారు.

అందని కిట్లు..

ఇటీవల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆస్పత్రి యంత్రాంగం రక్షణ కోసం ఇచ్చిన పీపీఈ కిట్లు కూడా సిబ్బంది వరకు చేరలేదని తెలుస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందించే వైద్య సిబ్బంది స్వీయ రక్షణ ముఖ్యమని భావించిన ఎంపీ కిట్లను, మాస్కులను అందజేస్తే వాటిని కీలక బాధ్యతల్లో ఉన్నవారు తమవద్దే అట్టిపెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరో పెద్ద పోస్టులో ఉన్న మేడం గారి చాంబర్‌లోకి వెళ్లాలంటే కచ్చితంగా చెప్పులు వదిలేసి మరీ వెళ్లాలట. లేనట్లయితే వారిపై మండిపడటం ఖాయం అని సిబ్బంది చెప్పుకుంటున్నారు. పెత్తందారీ వ్యవస్థను మరిపించే విధంగా ఆ మేడం హుకూం జారీ చేస్తే వినాల్సిందేనని, లేదంటే కష్టమని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మదనపడిపోతున్నారు.

Next Story