ఇదీ.. అవినీతి నాగరాజు ఘన చరిత్ర

by  |
ఇదీ.. అవినీతి నాగరాజు ఘన చరిత్ర
X

దిశ, మేడ్చల్ ప్రతినిధి: అవినీతి నిరోధక శాఖకు చిక్కిన నాగరాజు ఇళ్లల్లో వెతికిన కొద్ది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దారు రూ.కోటి 10 లక్షల లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. శనివారం అల్వాల్లోని నాగరాజు నివాసంలో ఏసీబీ జరిపిన సోదాల్లో రూ.28 లక్షల నగదు, రెండు కిలోల బంగారంతోపాటు రెండు బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలను కొనసాగుతున్నాయి.

నాగారాజుకు ముందు నుంచే అవినీతి చరిత్ర ఉంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ 2011 జూన్లో కేసు నమోదైంది. అప్పట్లోనే నాగరాజు ఇంట్లో కోట్ల ఆస్తులను గుర్తించారు. ప్రభుత్వ పెద్దల అండ.. రాజకీయ పలుకుబడితో కేసు నుంచి బయపడి నట్టు సమాచారం. రెవెన్యూ శాఖలో టైపిస్ట్ గా చేరిన నాగరాజు తహసీల్దారు వరకూ ఎదిగాడు. పని చేసిన చోట అవినీతికి పాల్పడేవాడనే ఆరోపణలున్నాయి. కాసుల వర్షం కురిపించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే పలు హోదాలలో పనిచేశాడు. డిమాండ్ ఉన్న నగర శివారు మండలాల్లోనే పోస్టులు వేయించుకున్నాడు. దస్త్రం కదలాంటే పైకం ముట్టాల్సిందే. ప్రతి పనికి వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఖరీదైన విల్లా కొనిచ్చి

జిల్లాలోని ముగ్గురు తహసీల్దర్లు తాము చేస్తున్న అవినీతి, అక్రమాలకు సహకరించాలంటూ ఓ ఉన్నతాధికారికి ఖరీదైన విల్లాను కొనుగోలు ఇచ్చారని సమాచారం. ఎంత పెద్ద అధికారినైనా మేనేజ్ చేయవచ్చుననే ధీమాతోనే నాగరాజు రాంపల్లిలో రెండు కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడు. పూర్వీకుల నుంచి ఒక కుటుంబానికి 44 ఎకరాలకు పైగా భూమి సంక్రమించగా, 1996లో 16 ఎకరాల భూమికి సంబంధించి హక్కులను ఆ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 28 ఎకరాలకు సంబంధించి పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు నాగరాజు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కారులో రూ.8 లక్షలు, ఇంట్లో రూ.28 లక్షలు నగదు, అర కిలో బంగారం ఆభరణాలు, ఒక లాకర్ కీ తో పాటు వివిధ భూములకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుతో పాటు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు శ్రీనాథ్, కందాడి అంజిరెడ్డి, వీఆర్ఏ బొంగు సాయిరాజ్ను అరెస్టు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

Next Story