రివ్యూ ప్లీ వేయడానికి కుల్‌భూషణ్ జాదవ్ తిరస్కరించాడు: పాక్

by  |
రివ్యూ ప్లీ వేయడానికి కుల్‌భూషణ్ జాదవ్ తిరస్కరించాడు: పాక్
X

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తనకు విధించిన మరణ శిక్ష తీర్పును పున:సమీక్షించాలని పిటిషన్ వేయడానికి తిరస్కరించాడని దాయాది దేశం తెలిపింది. దీనికి బదులు గతంలో తాను దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌తోనే ముందుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడని వివరించింది. అలాగే, భారత దౌత్యాధికారులకు రెండోసారీ అతనితో సంభాషించే అవకాశం కల్పించినట్టు వెల్లడించింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అదనపు అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన నేర నిరూపణ ప్రక్రియ, మరణ శిక్షను సమీక్షించడానికి రివ్యూ దాఖలుకు గతనెల 17న కుల్‌భూషణ్ జాదవ్‌ను ఆహ్వానించామని, కానీ, తన న్యాయపరమైన హక్కును వినియోగిస్తూ అందుక తిరస్కరించాడని చెప్పారు. 2017 ఏప్రిల్ 17న తాను దాఖలు చేసిన మెర్సీ ప్లీ ప్రక్రియనే నమ్ముకున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ వాదనల ప్రకారం, భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ 2016 మార్చి 3న అరెస్టయ్యాడు. గూఢచర్యం, ఉగ్రవాద అభియోగాల కింద భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష పడింది. కాగా, పాక్ మిలిటరీ కోర్టు అసభ్యకర విచారణపై భారత్ 2017 మేలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, మరణ శిక్షను రివ్యూ చేయాలని, భారత దౌత్య అధికారులు జాదవ్‌ను కలిసే అవకాశం కల్పించాలని గతేడాది జులైలో పాకిస్తాన్‌ను కోర్టు ఆదేశించింది.


Next Story

Most Viewed