రాబోయేది సైబర్ యుద్దాలే: కేటీఆర్

by  |
రాబోయేది సైబర్ యుద్దాలే: కేటీఆర్
X

దిశ, శేరిలింగంపల్లి: రోజు రోజుకు సైబర్ క్రైం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు ప్రభుత్వం కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. శుక్రవారం కొటెల్లిజెంట్ నూతన సైబర్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీఓఈ) ను ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, కొటెల్లిజెంట్ ఫౌండర్ అండ్ సీఈవో శ్రీకిరణ్ పాటిబండ్లతో కలిసి ప్రారంభించారు. కొటెల్లిజెంట్ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు, సేవలను అందించే అత్యున్నత సంస్థలలో ఒకటి కావడంతో పాటుగా టెక్ డెమోక్రసీ కంపెనీగా గుర్తింపు పొందింది.

యాక్సస్ మేనేజ్మెంట్ పరిష్కారాలను అందించడంలో ప్రాచుర్యం కూడా పొందింది. ప్రభుత్వం కొటెల్లిజెంట్ మధ్య అవహగన ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన ప్రతులను మంత్రి కేటీఆర్ సమక్షంలో కొటెల్లిజెంట్ ఫౌండర్, సీఈఓ శ్రీకిరణ్ పాటిబండ్ల పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయని, భవిష్యత్తులో రక్తం చుక్కలేని యుద్దాలు జరుగుతాయని, అవన్నీ సైబర్ యుద్ధాలేనని అన్నారు.

ప్రధాని సోషల్ అకౌంట్ కూడా హ్యాకింగ్ జరిగిందని, సైబర్ క్రైమ్ అనేది పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. సైబర్ క్రైమ్ నిరోధానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అందుకు కొటెల్లిజెంట్ సంస్థ శ్రీకిరన్ పాటిబండ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎన్నో కార్యక్రమాల ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని, నైపుణ్యం ఉన్నవారికి అన్ని రంగాల్లోనూ ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సైబర్ సెక్యూరిటీలో ఉన్నత ప్రమాణాలతో ముందుకు వచ్చిందని, సైబర్ వారియర్స్ ద్వారా ఎన్నో సైబర్ థ్రెడ్స్ ను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టెక్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.

Next Story