హుజూరాబాద్‌పై కేటీఆర్ ఫోకస్.. ఎమ్మెల్సీ పల్లాకు కీలక బాధ్యతలు

by  |
kcr-ktr
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ గెలుపు బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేపట్టారు. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలాగైనా విజయం సాధించి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి రోజూ ఇన్ చార్జులు ఏం చేస్తున్నారనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరును కలిసేలా చర్యలు చేపడుతున్నారు కేటీఆర్.

ఈ నేపథ్యంలో ఇల్లందకుంట, వీణవంకలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హుజూరాబాద్ లో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సతీష్, వీణవంక మండలంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జమ్మికుంట లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కమలాపూర్‌లో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రంగనాయక సాగర్ వద్ద నుంచి మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలోని రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమించారు. మంత్రి కేటీఆర్ ప్రతి రోజూ మానిటరింగ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన సమయంలో పార్టీ సభ్యత్వాలను లక్షా 21 వేలు చేశారు. ఆ సభ్యత్వాలు చేసిన వారంతా పార్టీ కార్యకర్తలేనని వారందరిని కలిసే బాధ్యతను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటీఆర్ అప్పగించారు. ప్రతి సభ్యత్వాన్ని డిజిటలైజేషన్ తో పాటు సభ్యత్వం తీసుకున్న వారిని నేరుగా కలిసే ప్రయత్నం చేయాలని ఆదేశించడంతో ఆ పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గత రెండురోజులుగా పల్లా ఇల్లంతకుంట మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సీతంపేట, వంతాడుపుల, గడ్డివాముపల్లి, టెకుర్తి, శ్రీరాంపల్లి,కనగర్తి, వగ్గోదూరములపల్లి, మల్యాల, లక్ష్మాజిపల్లెల్లో ఆదివారం బూత్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వాలపై ఆరా తీయడంతో పాటు వారిని నేరుగా కలుస్తున్నారు.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపు… ప్రజలంతా గులాబీ పక్షమే అనే ధోరణితో ముందుకెళ్తుంది. ఎన్నికలకు ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది అధిష్టానం కానీ. హుజూరాబాద్ ఎన్నికల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ బీసీ నేతగా ఉండటం, నియోజకవర్గంలో ఆదరణ ఉండటంతో టీఆర్ఎస్ అధిష్టానం ఆచి తూచి వ్యవహరిస్తోంది. అన్ని గ్రామాలకు, 5 మండలాలకు, 2 మున్సిపాలిటీలకు ఇన్ చార్జులను నియమించినప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జిని, పార్టీ అభ్యర్థిని నేటికీ ప్రకటించలేదు. స్వయంగా ఎన్నికలకు మానిటరింగ్ చేస్తున్నప్పటికీ ఇంకా అభ్యర్థి వేటలోనే ఉన్నారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Next Story

Most Viewed