తప్పు ఒప్పుకున్నావుగా ఇంకేంటి.. ఈటలపై కృష్ణమోహన్ ఫైర్

by  |
తప్పు ఒప్పుకున్నావుగా ఇంకేంటి.. ఈటలపై కృష్ణమోహన్ ఫైర్
X

దిశ, హుజురాబాద్ : ఆత్మగౌరవం అంటే బడుగులు, బలహీనవర్గాల భూములను లాక్కోవడమా అని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ ప్రశ్నించారు. బుధవారం హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ నాయకుడిగా ఎదిగిన ఈటల రాజేందర్ బీసీ బిడ్డల భూములు స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 25 ఎకరాల భూమి తీసుకున్నది వాస్తమేనని ఈటల ప్రకటించారని, అవసరమైతే ప్రభుత్వం నుండి క్లియరెన్స్ తీసుకునేందుకు ప్రయత్నించానని కూడా ఆయనే ప్రకటించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్టు ఈటల ఒప్పుకున్నట్టేనని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.

బీసీలను ముఖ్యమంత్రి కేసీఆర్ అణచివేస్తున్నారని ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే బీసీ నాయకుడైన ఈటల మంత్రిగా ఎలా ఎదిగాడో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నుండి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు అదే పార్టీలో కొనసాగితే అమ్ముడుపోయినట్టు ఎలా అవుతుందని అడిగారు. పార్టీలో ఉండి అధినేతపై, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమే అవుతుందని కృష్ణమోహన్ ఆరోపించారు. హుజురాబాద్, కమలాపూర్ ప్రాంత ప్రజల వల్లే ఈటల ఈ స్థాయికి ఎదిగారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. నిజాలు ఒప్పుకునే మనస్తత్వం లేని ఈటల.. పెంపుడు మిత్రులతో సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.



Next Story

Most Viewed