కేంద్ర బలగాల రక్షణ లేకుండా ఏపీకి వెళ్లలేం

by  |
Krishna River Management Board rayalaseema-lift-irrigation
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనపై అనిశ్చితి నెలకొంది. బుధవారమే నిపుణుల కమిటీ పరిశీలనకు వెళ్తుందని ప్రచారం జరిగినా.. దానిపై క్లారిటీ లేకుండా పోయింది. పర్యటకు వెళ్తారా… లేదా అనేది కృష్ణా బోర్డు తేల్చి చెప్పడం లేదు. అయితే ఏపీకి వెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్ర బలగాల రక్షణ కావాలంటూ కేంద్ర హోం శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి లేఖ పంపించారు. దీనిపై రిప్లై వచ్చిన తర్వాతే పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన వచ్చేనెల 3 లేదా 4 తేదీల్లో రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.

ఏపీని నమ్మి వెళ్లలేం..

కృష్ణా జలాల వివాదాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతాన్ని, పనులను పరిశీలించాలని కేంద్రం, ఎన్జీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. వాస్తవంగా ఏప్రిల్​లోనే నిపుణుల కమిటీ వెళ్లాల్సి ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలించడానికి హరికేష్​ మీనా నేతృత్వంలోని కమిటీలో కేఆర్​ఎంబీ కార్యదర్శి రాయిపురే, బోర్డు సభ్యుడు (విద్యుత్తు) ఎల్‌.బి.ముతంగ్‌, కేంద్ర జలసంఘం (హైదరాబాద్‌)లో డైరెక్టర్‌గా ఉన్న దేవేందర్‌రావు సభ్యులుగా గతంలోనే కమిటీని నియమించారు. ఈ కమిటీ ఏప్రిల్​ 19, 20 తేదీల్లో పరిశీలనకు వెళ్లాల్సి ఉండగా… ఏపీ నుంచి వ్యతిరేకత ఎదురుకావడం, నోడల్​ అధికారిని నియమించకపోవడం, అక్కడి ఇంజినీర్లకు కరోనా పాజిటివ్​ వచ్చిందనే కారణాలతో పర్యటనను వాయిదా వేశారు.

అయితే ఇటీవల వివాదాలు మరింత పెరగడంతో పాటుగా సీఎం కేసీఆర్​… కేంద్రానికి మరోమారు ఫిర్యాదు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​కు రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాలపై వివరించారు. దీనిపై కేంద్రం కూడా కృష్ణా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు ఎన్జీటీ కూడా మూడు రోజుల కిందట బోర్డును తప్పు పట్టింది. పరిశీలనకు ఎందుకు వెళ్లలేదని, నివేదిక ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తూ వచ్చేనెల 12లోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పర్యటన అనివార్యంగా మారింది.

అయితే ఏపీకి వెళ్లే అంశంపై కేఆర్​ఎంబీ నిపుణుల కమిటీ భయం వ్యక్తం చేసింది. గతంలో ఆర్డీఎస్​ దగ్గర బాంబులతో దాడి వంటి సంఘటనలను ఉదహరిస్తూ మంగళవారం లేఖ పంపింది. ఏపీ పోలీసులను నమ్మి తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని, తమ ప్రాణాల భద్రతకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యటనకు సంబంధించిన తగిన సంఖ్యలో కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాటు చేయాలని, కేంద్ర బృందాల రక్షణలోనే పరిశీలనకు వెళ్తామంటూ లేఖలో సూచించింది. కేంద్ర బలగాలను పంపిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

నోడల్​ అధికారి లేడు

రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతం తెలిసిందే అయినప్పటికీ… ప్రాజెక్టు గురించి, అక్కడి పనుల గురించి వివరాలు చెప్పేందుకు నోడల్​ అధికారి తప్పనిసరిగా ఉండాలని కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని నిపుణులు కమిటీ అభిప్రాయపడుతోంది. ఈ అంశాలను లేఖలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే దీనిపై లేఖ పంపించామని, కానీ ఏపీ నుంచి సమాధానం లేదంటూ వెల్లడించింది. ప్రాజెక్టు వివరాలను సాంకేతికంగా చెప్పేందుకు సంబంధిత ఇంజినీర్లతో ఫెసిలిటేషన్​ బృందాన్ని ఏర్పాటు చేయాలని, కానీ ఏపీ ఏర్పాటు చేయడం లేదని, దీనిపై మరోమారు ఏపీకి ఆదేశాలివ్వాలని పేర్కొంది.

వచ్చేనెలలోనే పర్యటన…!

నిపుణుల కమిటీ రాయలసీమ ప్రాంతానికి వచ్చేనెలలోనే వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 3 లేదా 4వ తేదీల్లో వెళ్లనుందని జలవనరుల శాఖ అధికారులు చెప్పుతున్నారు. ఇప్పటి వరకు సంబంధిత కమిటీకి కూడా కృష్ణా బోర్డు నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కమిటీతో పాటుగా తెలంగాణ, ఏపీ ఇరిగేషన్​ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటోంది. కానీ కృష్ణా బోర్డు నుంచి ఎలాంటి సమాచారం మంగళవారం రాత్రి వరకు కూడా పంపిచలేదు.

వచ్చేనెల 12లోగా పరిశీలన చేసి, నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ కూడా ఆదేశాలివ్వడంతో జూలై 4వ తేదీ వరకు పరిశీలన పూర్తి చేసి, నివేదికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వచ్చేనెల 12 వరకు కూడా పరిశీలన కమిటీ పర్యటించకుండా నివేదిక ఇవ్వకుంటే ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు చేయడంతో పాటు పలు అంశాల్లో ఏపీ సీఎస్​ను కూడా జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed