'మాకు రూ. కోట్లలో లాభమొచ్చింది'

by  |
మాకు రూ. కోట్లలో లాభమొచ్చింది
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ బుధవారం 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు నమోదైనట్టు పేర్కొంది. 2019-20లో అధిక కేటాయింపుల కారణంగా రూ. 1,267 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 1,408 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఈసారి 10 శాతం తగ్గిందని సంస్థ తెలిపింది. ఇంతకుముందు కోటక్ బ్యాంక్ నికర లాభాన్ని రూ. 1200 కోట్లుగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇటీవల ఆర్‌బీఐ ఇచ్చిన మారటోరియం విధింపును మొత్తం బ్యాంక్ అకౌంట్‌లలో 26 శాతం మంది ఖాతాదారులు ఉపయోగించుకున్నారని బ్యాంకు స్పష్టం చేసింది.

నాలుగో త్రైమాసికంలో రూ. 1,047 కోట్ల కేటాయింపులు జరిపామని, ఆర్‌బీఐ నిర్దేశాల మేరకు రూ. 650 కోట్లను కరోనా వైరస్ నేపథ్యంలో కేటాయించినట్టు కోటక్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ మొత్తం కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జరిపిన రూ. 171 కోట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 3,560 కోట్లతో 17.25 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ. 3,036 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్ధక ఆస్తులు 2.25 శాతంగా ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 2.14 కంటే ఇది అధికం. అంతకుముందు త్రైమాసికం 2.46 శాతం కంటే తక్కువగా నమోదైనట్టు బ్యాంకు వెల్లడించింది.



Next Story